పట్టు సాధిస్తే మెట్టు ఎక్కినట్లే!

పట్టు సాధిస్తే మెట్టు ఎక్కినట్లే!


ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాలను చేజిక్కించుకొని, జీవితాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకునే క్రమంలో గత ఆగస్టులో ఔత్సాహికులు సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రిలిమ్స్ రాశారు. వీటి ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 18,000 మంది మెయిన్‌‌సకు అర్హతకు సాధించారు. వీరు డిసెంబర్ 14 నుంచి  జరిగే మెయిన్స్ మెట్టును అధిగమించాల్సిందే! ఈ నేపథ్యంలో మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1 సిలబస్‌లో ఏయే అంశాలున్నాయి? వాటిపై పట్టుసాధించడమెలా? వంటి అంశాలపై సబ్జెక్టు నిపుణుల విశ్లేషణ...

 

 భూగోళశాస్త్రం వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ

 సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించిన సిలబస్‌లోని అంశాలు.. ప్రపంచ భౌతిక భూగోళ విశేషాంశాలు.ప్రపంచ వ్యాప్తంగా (దక్షిణాసియా, భారత ఉపఖండంతో సహా) ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ.ప్రపంచ వ్యాప్తంగా (భారత్ సహా) వివిధ ప్రాంతాల్లో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగ పరిశ్రమల విస్తరణ- దానికి కారణాలు.భూకంపాలు, సునామీ, అగ్నిపర్వతాలు, తుఫానులు వంటి ముఖ్య భూభౌతిక దృగ్విషయాలు తదితర అంశాలు సిలబస్‌లో ఉన్నాయి.

 

 ఇంధనం, పర్యావరణానికి ప్రాధాన్యం

 కొత్త విధానంలో తొలిసారి గతేడాది మెయిన్స్ జరిగింది. జీఎస్ పేపర్-1 జాగ్రఫీకి సంబంధించి ఇంధనం, పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు వచ్చాయి. ఈసారి వీటితో పాటు కొత్త అంశాలకు కూడా ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు రావొచ్చు. అందువల్ల అభ్యర్థులు ఈ దిశగా ప్రిపరేషన్ కొనసాగించాలి. Ex: With growing scarcity of fossil fuels, the atomic energy is gaining more and more significance in India. Discuss the availability of raw  material required for the generation of atomic energy in India and in the World

 

 గత పరీక్షలో అణుశక్తిపై ప్రశ్న వచ్చినందున, ఈసారి ఇతర శక్తి వనరులపై ప్రశ్నలు ఇచ్చేందుకు అవకాశముంది. అందువల్ల శక్తి వనరుల గురించి చదివేటప్పుడు వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు జలవిద్యుత్ శక్తికి సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం, అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల వనరులు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలపై భారత్ అనుసరిస్తున్న విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇంధన భద్రతలో ప్రస్తుతం చర్చకు తావిస్తున్న గ్యాస్‌పైప్‌లైన్ల సమాచారాన్ని తెలుసుకోవాలి.

 

 పారిశ్రామిక ప్రాంతాలు

  ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు అధికంగా కేంద్రీకృతమై ఉన్నాయి.. దానికి గల కారణాలను తెలుసుకోవాలి. వనరుల విస్తరణకు, పారిశ్రామిక అభివృద్ధికి మధ్య సంబంధాన్ని విశ్లేషించాలి. ఈ విభాగంలో భారత్‌కు ప్రాధాన్యమిస్తూ చదవాలి. పెట్రో కెమికల్, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన సంస్థలు అభివృద్ధి చెందిన దేశాలకు బదులు అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు దృష్టిసారిస్తుండటానికి కారణాలను తెలుసుకోవాలి.  వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణాలను విశ్లేషించాలి.  ప్రపంచ, భారతీయ పర్యాటక రంగం, అభివృద్ధికి అవకాశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి.

 

 భూభౌతిక దృగ్విషయాలు: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుఫానులు తదితరాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. వీటిని చదువుతున్నప్పుడు భారత్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఏ విపత్తులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తున్నాయి? వాటికి కారణాలను తెలుసుకోవాలి. హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవించడానికి కారణాలేంటి? హిందూ మహాసముద్రంతో పోల్చితే పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా సునామీలు ఏర్పడుతున్నాయి ఎందుకు? వంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.

 

 కాన్సెప్టు ఆధారిత ప్రశ్నలు

 జాగ్రఫీ, ఎకాలజీకి సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్టులపై నేరుగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల వీటిని గుర్తించి, అధ్యయనం చేయడం తప్పనిసరి. క్రమక్షయం (ఉటౌటజీౌ), శైథిల్యం (గ్ఛ్చ్టిజ్ఛిటజీజ), ఫుడ్ పిరమిడ్, ఫుడ్ వెబ్, న్యూట్రియెంట్ సైకిల్, బయో మ్యాగ్నిఫికేషన్ వంటి వాటిని చదవాలి. Ex: What do you understand by the theory of 'Continental drift'? Discuss the prominent evidences in its support? నదులు, హిమానీ నదాలు వంటి వాటిపై భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ప్రభావం తెలుసుకోవాలి.

 

 ప్రాచీన చరిత్ర

 భారతదేశ చరిత్రపై ‘కార్ల్‌మార్క్స్’ అభిప్రాయం తెలపండి?

 ఈ రకమైన ప్రశ్నల ద్వారా అభ్యర్థుల అవగాహన తీరు, వారి ఆలోచనా దృక్పథాన్ని అంచనా వేస్తారు. చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ మాటల్లో చెప్పాలంటే ‘జాతీయవాద చరిత్ర రచనా విధానంలో భాగంగా తలెత్తినదే మార్క్సిస్టు చరిత్ర రచనా విధానం. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రధానంగా జాతీయవాద చరిత్ర రచనా విధానం, మార్క్సిస్ట్ చరిత్ర రచనా విధానానికి మధ్య సామ్యాలు గమనించాలి.

 

 భారతదేశ చరిత్రపై వలసవాదుల అభిప్రాయాలు, వారు చరిత్ర అభివృద్ధికి దోహదం చేసిన తీరును వివరించండి?

 ప్రాచీన భారతీయులు సంప్రదాయ చరిత్రను మహాకావ్యాలుగా, పురాణాలుగా, ఆత్మకథలను పోతన రాతప్రతుల రూపంలో భద్రపరిచారు. కానీ బ్రిటిష్ యంత్రాంగం భారతదేశ చరిత్రపై ఆధునిక పరిశోధన చేసింది. ఈ ప్రక్రియను 1776లో మను ధర్మశాస్త్రాన్ని ‘ఏ కోడ్ ఆఫ్ జెంటూలాస్’ పేరిట అనువదించడంతో ప్రారంభించారు. 1785లో చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. 1804లో బాంబే సొసైటీ, 1823లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు వీటిపై అవగాహన పెంపొందించుకోవాలి.

 

 భిన్న కోణాల్లో అధ్యయనం

 ప్రాచీన చరిత్రకు సంబంధించి ‘భారతీయ సంస్కృతి-వారసత్వం’పై ఎక్కువగా దృష్టిసారించాలి. చరిత్రను చారిత్రక దృక్పథంతో పాటు కళలు, సాంస్కృతిక సేవ, వారసత్వ సంపద కోణంలో ఆలోచించి ప్రిపరేషన్ కొనసాగించడం ఉత్తమం. ప్రాచీన భారతదేశంలోని కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, నూతన మతాల ఆవిర్భావం వాటి ప్రాధాన్యత, క్షీణత తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. శిల్పకళారంగం, చిత్రలేఖనం, సంగీతం అంశాలను కీలకమైనవిగా భావించాలి.

 

 మధ్యయుగం

 చోళుల సాంస్కృతిక సేవ-గ్రామ పాలన, రాజపుత్రుల సామాజిక-సాంస్కృతిక సేవ అతి ముఖ్యమైనవి. భూమి శిస్తు విధానం (ఉత్తర భారతదేశంలో)లో కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రభు వర్గానికి- భూస్వామికి; రైతుకు మధ్యగల ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలు, శాఖలు, కరువు నివారణకు తీసుకున్న జాగ్రత్తలను అధ్యయనం చేయాలి. అంటరానితనం-తెగలతో సామాజిక వ్యవస్థలో వచ్చిన మార్పులపై కొంతైనా అధ్యయనం తప్పనిసరి. మధ్యయుగం నాటి ఆర్థిక విధానం ముఖ్యమైనది. మొగలు సామ్రాజ్యంలోని ముఖ్యమైన అంశాలపై అవగాహన అవసరం. స్త్రీలు- బానిసలు; విజయనగర సామ్రాజ్యంలోని వర్తక వాణిజ్య అంశాలనూ చదవాలి.

 

 ఆధునిక యుగం

 ఇది చాలా ముఖ్యమైన విభాగం. దీన్నుంచి ఎక్కువగా తులనాత్మక, లోతైన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. బ్రిటిష్ విధానాలకు సంబంధించి స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమత్వ విధానాలను పరిశీలించండి? వలసవాదం ముఖ్య లక్షణాలను అంచనా వేయండి? వంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఈ విభాగంలో 1857 తిరుగుబాటు; మితవాదులు, అతివాదుల విధానాలు; మత, సంఘసంస్కరణ ఉద్యమాలు; 1909 చట్టంలోని ముఖ్యాంశాలు, గాంధీ సిద్ధాంతాలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు తదితర అంశాలపై లోతైన అవగాహన అవసరం.

 

 ప్రపంచ చరిత్ర

 ఈ విభాగంపై అభ్యర్థులకు లోతైన అవగాహన ఉండదు. ప్రశ్నలు నేరుగా రావు. ఇవి స్టేట్‌మెంట్ల రూపంలో వస్తున్నాయి. ప్రపంచ చరిత్రకు సంబంధించి ఫ్రెంచి వైజ్ఞానిక తత్వవేత్తలు ప్రవచించిన సిద్ధాంతాలు, ఐరోపాలోని రాజకీయ ప్రభావాలతో పాటు మార్క్సియన్ సోషలిజం, ఫాబియన్ సోషలిజం తదితర సిద్ధాంతాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రపంచ కార్మికోద్యమాల నేపథ్యం, జర్మనీ-ఇటలీ ఏకీకరణ ఉద్యమాల ప్రభావం, నెపోలియన్ భూఖండ విధానం, మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు-వాటి ప్రభావం, నల్లమందు యుద్ధాలు తదితర అంశాలపై పట్టు తప్పనిసరి. 20వ శతాబ్దంలో జపాన్ సాధించిన ప్రగతి, బాల్కన్‌లో సంక్షోభం, జార్జ్ రాజుల నిరంకుశత్వం-రష్యా విప్లవం, లెనిన్ నూతన ఆర్థిక విధానం, జర్మనీలో నాజిజం, ఇటలీలో ఫాసిజం, చైనాలో కమ్యూనిజం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం-తదనంతర పరిణామాలు, మూడో ప్రపంచ దేశాల ఆవిర్భావం వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.

 

 ‘‘గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్‌లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. ప్రిపరేషన్‌లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. ఏ అంశాన్ని చదువుతున్నా వర్తమాన పరిస్థితులకు అన్వయించుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి భారత్ స్థితిగతులపై అవగాహన పెంపొందించుకోవాలి. గతేడాది 100, 200 పదాల్లో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు వచ్చాయి. ఈసారి ఇలాగే అడగాలని లేదు. స్వల్ప సమాధాన ప్రశ్నలు పెరిగే అవకాశముంది. అలాంటప్పుడు విజయంలో సమయ పాలన కీలకమవుతుంది.

 

 ‘‘గాంధీ సిద్ధాంతాలు-నిర్మాణాత్మక కార్యక్రమాలు, పోరాట పద్ధతులపై వ్యాసరూప ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ లాంటి గొప్ప వ్యక్తి చేయాల్సింది కాదని చర్చిల్ విమర్శించడం; గాంధీ వ్యక్తిత్వం, మేధస్సును సామాన్యులు అంచనా వేయలేరని ఐన్‌స్టీన్ వంటి మేధావి అనడం తదితర స్టేట్‌మెంట్లపై ఎక్కువగా దృష్టిసారించాలి. గాంధీ-అంబేద్కర్ మధ్య సారూప్యత, నెహ్రూ-చర్చిల్ మధ్య సారూప్యత వంటి వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి’’

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top