సామాజిక ఉద్యమాలు

సామాజిక ఉద్యమాలు


మహిళా ఉద్యమాలు

ప్రాచీన కాలంలో స్త్రీలు.. పురుషులతో సమానంగా హక్కులు కలిగి ఉన్నారని తెలుస్తోంది. వేద కాలంలో గార్గి, మైత్రేయి వంటి ఎందరో మహిళలు పురుషులతో సమానంగా విద్యనభ్యసించారు. స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేదని రుగ్వేద శ్లోకాల ద్వారా తెలుస్తోంది. అయితే తర్వాతి కాలంలో స్త్రీల పరిస్థితి క్రమంగా దయనీయంగా మారుతూ వచ్చింది. మధ్యయుగం నాటికి మతం, సంప్రదాయాల పేరిట బాల్య వివాహాలు, సతీసహగమనం, దేవదాసీ వ్యవస్థ, పునర్వివాహాలను అంగీకరించకపోవడం వంటి ఎన్నో దురాచారాలు ఆవిర్భవించాయి.



సతీసహగమనం

భర్త మృతి చెందినప్పుడు అతని మృతదేహం తో పాటు భార్య కూడా చితిమంటలో కాలి మరణించడం సతీసహగమనం. దీన్ని స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా చేయించేవారు. ఈ దురాచారం బెంగాల్‌లో ఎక్కువగా ఉండేది. దయాభాగ విధానం అమల్లో ఉండటం దీనికి కారణంగా చెబుతారు. దయాభాగ విధానం ప్రకారం మరణించిన భర్త ఆస్తిపై వితంతువుకు హక్కు ఉంటుంది. ఈ అడ్డును తొలగించుకునేందుకు సతీసహగమనాన్ని ఉపయోగించుకున్నట్లు భావిస్తున్నారు. భర్త చనిపోయిన పరిస్థితిలో  భార్య మానసిక స్థితిని అంచనా వేయకుండా, ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి, బలవంతంగా సహగమనం చేయించేవారు. 1815–1828 మధ్య ఒక్క బెంగాల్‌లోనే 8,000 మందికి పైగా మహిళలు ఈ దురాచారానికి బలయ్యారు.



జౌహర్‌

ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించడాన్ని జౌహర్‌ అంటారు. గెలిచిన రాజులు, సైన్యం చేతిలో లైంగిక దాడులకు గురవకుండా, తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇలా చేసేవారు. ఈ ఆచారం రాజపుత్రుల్లో ఎక్కువగా ఉండేది. మధ్యయు గంలో రాణి పద్మావతి జౌహర్‌ ప్రముఖమైంది.



పరదా పద్ధతి

మధ్యయుగంలో ఈ ఆచారం ఎక్కువగా ముస్లింలు, హిందూ కులీనులు, కొన్ని జాతుల్లో కనిపించేది. స్త్రీలు తాము బయటకు కనిపించకుండా తెర వెనుక ఉండేవారు. లేదా మేని ముసుగు ధరించేవారు. దీనివల్ల బయటకు వెళ్లడానికి, స్వేచ్ఛగా ఇతరులను కలవడానికి అవకాశం ఉండేది కాదు. స్త్రీల విద్యాభ్యాసానికి ఇది ముఖ్య అవరోధంగా ఉండేది.



దేవదాసీ వ్యవస్థ

దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పదో శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ ఆచారం ప్రకారం కన్యలకు దేవుని విగ్రహంతో వివాహం జరిపిస్తారు. వారు దేవుణ్ని సేవిస్తూ, నృత్యాలు చేస్తూ జీవితాంతం కన్యలుగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఈ వ్యవస్థను పక్కదారి పట్టించి, వారిని వేశ్యలుగా మార్చారు.



బాల్య వివాహాలు

చాలా చిన్న వయసులోనే బాలికకు వివాహం జరిపించాలనే దురాచారం భారతీయ సమాజంలో ఉండేది. మూడేళ్లు, ఐదేళ్ల వయసులోనే వివాహాలు జరిపించేవారు. ఇది బాలికల విద్యాభ్యాసానికి అవరోధంగా నిలిచేది. పసి వయసులోనే వితంతువులుగా మారి, దుర్భర జీవితాన్ని అనుభవించేవారు. చిన్నతనంలోనే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తేవి.



స్త్రీవాద ఉద్యమాలు

భారతదేశంలో స్త్రీవాద ఉద్యమాలను మూడు దశలుగా విభజించొచ్చు. మొదటి దశ (బ్రిటిష్‌ పాలనా కాలం–1915): ఈ దశలో ఐరోపా వలస పాలకులు మూఢాచారాల గురించి బహిరంగంగా మాట్లాడటంతోపాటు వాటి నిర్మూలనకు కొన్ని చట్టాలు చేశారు. స్త్రీల అణచివేతను, మూఢాచారాలను తొలగించేందుకు సంఘ సంస్కర్తలు ప్రయత్నించారు.



రెండో దశ (1915–1947): ఈ దశలో స్త్రీలు తమ కోసం ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు.



మూడో దశ (స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు): ఈ దశలో స్త్రీవాద ఉద్యమాల దృక్పథం, పోరాట పద్ధతుల్లో ఎంతో వైవిధ్యాన్ని గమనించవచ్చు.



స్త్రీవాద ఉద్యమాలను కొందరు స్వాతంత్య్ర పూర్వదశ, అనంతర దశగా విభజించారు.



స్వాతంత్య్ర పూర్వ దశ: ఈ దశలో స్త్రీవాద ఉద్యమాలను రెండు దశలుగా విభజించొచ్చు. అవి.. సాంఘిక సంస్కరణ ఉద్యమం, స్వాతంత్య్ర ఉద్యమం. సాంఘిక సంస్కరణ ఉద్యమంలో స్త్రీలను అణచివేస్తున్న మూఢాచారాల తొలగింపునకు సంఘసంస్కర్తలు ప్రయత్నించారు. ఇదే సమయంలో మరోవైపు స్త్రీలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. దేశంలో సంఘసంస్కరణలకు ఆద్యుడు రాజా రామ్మోహన్‌రాయ్‌. సతీసహగమన నిషేధం, కులీనుల్లో బహు భార్యత్వ నిర్మూలన, స్త్రీల హక్కులకోసం ఆయన కృషి చేశారు. ఆయన కృషి వల్ల అప్పటి గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటిక్‌ సతీసహగమన నిషేధ చట్టం (1829, డిసెంబరు 4) చేశారు.



వితంతు పునర్వివాహాలు జరిపించేందుకు ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ ఎంతో కృషి చేశారు. ఆయన 1855 జనవరిలో వితంతు పునర్వివాహాన్ని సమర్థిస్తూ కరపత్రం ప్రచురించారు. ఆయన కృషి ఫలితంగా ప్రభుత్వం 1856, జూన్‌ 25న స్త్రీ పునర్వివాహాన్ని చట్టబద్ధం చేసింది. మొదటి వితంతు వివాహాన్ని విద్యాసాగర్‌ 1856, డిసెంబర్‌ 7న జరిపించారు.



దక్షిణ భారతదేశంలో వితంతు వివాహాలకు కందుకూరి వీరేశలింగం పంతులు కృషి చేశారు. ఆయన 1881, డిసెంబర్‌ 11న వితంతు వివాహం జరిపించారు.



పునర్వివాహం విషయంలో మహదేవ్‌ గోవింద రనడే, విష్ణుశాస్త్రి పండిట్, గోపాల్‌ దేశ్‌ముఖ్‌ వంటి ఎందరో సంస్కర్తలు కృషి చేశారు.



దేశవ్యాప్తంగా బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం (మహారాష్ట్ర) సభ్యులు బాల్య వివాహాల నిషేధానికి, వితంతు వివాహాలకు, స్త్రీ విద్యాభ్యాసానికి కృషి చేశారు.



బ్రహ్మ సమాజ సభ్యుడు కేశవచంద్రసేన్‌ బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేశారు. ఆయన కృషి వల్ల శారదా చట్టం (1929) వచ్చింది. దీని ప్రకారం బాలికల వివాహ వయసు 14 ఏళ్లు, బాలుర వివాహ వయసు 18 ఏళ్లు.



స్త్రీ విద్యకు మొదట్లో మిషనరీలు కృషి చేశాయి. 1818లో లండన్‌ మిషనరీ.. బెంగాల్‌లోని చిన్సురాలో బాలికల పాఠశాలను నెలకొల్పింది. అగ్రవర్ణాల్లో బాలికల విద్యపై అపోహ తొలగించేందుకు గౌరీ మోహన్‌ విద్యాలంకార్‌ 1822లో ‘స్త్రీ శిక్షా విధాయక్‌’ పేరిట కరపత్రం ప్రచురించారు.



1849 మేలో కలకత్తాలో జేఈడీ బెతూనీ ఒక పాఠశాలను ప్రారంభించారు. అది 1879 నాటికి మహిళా పాఠశాలగా మారింది.



పియరీ చరణ్‌ సర్కార్‌ బెంగాల్లోని బర్సాత్‌లో బాలికల కోసం మొదటి ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఇది తర్వాతి కాలంలో కాళీకృష్ణా బాలికా ఉన్నత పాఠశాలగా మారింది.



సంఘసంస్కర్తల కృషి వల్ల ఎందరో స్త్రీలు విద్యావంతులై, తమ హక్కుల కోసం పోరాడే చైతన్యం పొందారని చెప్పొచ్చు.



మహిళా సంఘ సంస్కర్తలు

మహిళా సంఘ సంస్కర్తలకు సంబంధించి మొదటగా చెప్పుకోదగినవారు సావిత్రీబాయి పూలే, పండిత రమాబాయి. సావిత్రీబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. తన భర్త జ్యోతిబా పూలేతో కలసి స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రముఖ సంఘ సంస్కర్త గోవింద రనడే భార్య రమాబాయి.. ‘ది హై క్యాస్ట్‌ హిందూ ఉమెన్‌’ పుస్తకంలో స్త్రీల అణచివేత, మతం, వలసవాదం    మొదలైన అంశాలను విమర్శించారు. పుణెలో సేవా సదన్‌ సంస్థను స్థాపించి, స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో స్త్రీ పాఠశాలలు, వితంతు ఆశ్రమాలను స్థాపించారు.



రమా బాయి పుణెలో ఆర్య మహిళా సమాజ్‌ను, బాంబేలో శారదా సదన్‌ను ఏర్పాటు చేశారు.



బెంగాల్‌ రచయిత్రి రసుందరీ దేవి.. ‘అమర్‌ జీవన్‌’ పేరిట 1876లో ఆత్మకథ రాశారు. ఆత్మకథను రాసిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఇందులో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడంతోపాటు స్త్రీలు చైతన్యవంతులు కావాలని సూచించారు.



19వ శతాబ్దం చివరి నాటికి మహిళలు తమ కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సోదరి స్వర్ణకుమారీ దేవి ఒకరు. ఆమె 1882లో కలకత్తాలో లేడీస్‌ సొసైటీని స్థాపించారు. స్త్రీల విద్యాభ్యాసం, వితంతు వివాహాలను ప్రోత్సహించడంతో పాటు, పేద స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన శిక్షణను ఈ సొసైటీ ఇచ్చేది. భారతి అనే పత్రికను కూడా స్వర్ణకుమారి నడిపారు. దీనికి ఎడిటర్‌గా పనిచేసి, తొలి భారతీయ మహిళా ఎడిటర్‌గా ఆమె గుర్తింపు పొందారు.



జాతీయ కాంగ్రెస్‌ మూడో సమావేశంలో సామాజిక సమస్యలపై అధ్యయనం కోసం 1887లో ఎం.జి.రనడే ‘నేషనల్‌ కాన్ఫరెన్స్‌’ను స్థాపించారు. ఇందులో మహిళా విభాగం (ఇండియన్‌ ఉమెన్‌ కాన్ఫరెన్స్‌) 1904లో ఏర్పడింది. దీని శాఖలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి.



కులం, మతం, వర్గం, పార్టీలనే భేదం లేకుండా దేశంలోని మహిళలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు, వారి నైతిక, ఆర్థికాభివృద్ధికి స్వర్ణకుమారీ దేవి కుమార్తె సరళాదేవి చౌధురాణి 1910లో ‘భారత స్త్రీ మండల్‌’ సంస్థను ప్రారంభించారు. లాహోర్, అమృత్‌సర్, హైదరాబాద్, ఢిల్లీ, కరాచీ వంటి చాలా నగరాల్లో ఈ సంస్థ శాఖలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ కొంత కాలమే మనుగడ సాగించినప్పటికీ జాతీయ స్థాయిలో స్త్రీలకు ప్రాతినిధ్యం వహించిన మొదటి సంస్థగా చెప్పొచ్చు.



స్త్రీలకు రాజకీయ హక్కులు!

స్త్రీలకు రాజకీయ హక్కులు, వ్యక్తిగత చట్టాల్లో సవరణలు ప్రాతిపదికన 1917–1945 మధ్య కాలంలో స్త్రీ వాద ఉద్యమాలు జరిగాయి.



1917లో అనీబిసెంట్, మార్గరెట్‌ కజిన్స్‌ వంటి ఐరిష్‌ మహిళలు ఉమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. వీరు స్వదేశంలో మహిళల ఓటు హక్కు కోసం పోరాటం సాగించారు. భారతదేశంలో కూడా మహిళల ఓటు హక్కు కోసం పోరాడారు. 1917 జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ, ముస్లింలీగ్‌లు మహిళల ఓటు హక్కు డిమాండ్‌ను సమర్థించాయి. సరోజినీ నాయుడు ‘మాంటేగ్‌’ను కలసి, స్త్రీలకు ఓటు హక్కు కల్పించేందుకు సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. పార్లమెంటు కమిటీ లింగ ఆధారిత అనర్హతను తొలగించినా, మహిళలకు ఓటు హక్కు నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభల విచక్షణకు వదిలేసింది.



భారత్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం ట్రావెన్‌కోర్‌–కొచ్చిన్‌ సంస్థానం. ఇది 1920లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. 1921లో మద్రాస్, బాంబేలు ఓటు ఓటుహక్కు ఇచ్చాయి. అయితే కొన్ని పరిమితులు విధించాయి.



1926లో కమలాదేవి చటోపాధ్యాయ్‌ మద్రాస్‌ శాసన మండలికి పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓడిపోయారు. ముత్తులక్ష్మీ రెడ్డిని మద్రాస్‌ ప్రభుత్వం శాసనమండలి సభ్యురాలిగా నియమించింది.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top