మాకు ప్రాణ హాని ఉంది.. | We expect Threat | Sakshi
Sakshi News home page

మాకు ప్రాణ హాని ఉంది..

Jul 17 2016 10:50 PM | Updated on Sep 4 2017 5:07 AM

మండల పరిధిలోని మన్నవ గ్రామంలో భర్తను హత్యచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భార్య రేగులగడ్డ జ్యోతి కేసుకు సంబంధించి పలువురు నిందితులు పరారీలో ఉన్నారని, వారివల్ల తమకు ప్రాణహాని ఉందని హతుడు రేగులగడ్డ రవి పిల్లలు, బంధువులు ఆరోపిస్తున్నారు.

భార్య చేతిలో హతమైన రవి పిల్లలు, బంధువు
పొన్నూరు : మండల పరిధిలోని మన్నవ గ్రామంలో భర్తను హత్యచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భార్య రేగులగడ్డ జ్యోతి కేసుకు సంబంధించి పలువురు నిందితులు పరారీలో ఉన్నారని, వారివల్ల తమకు ప్రాణహాని ఉందని హతుడు రేగులగడ్డ రవి పిల్లలు, బంధువులు ఆరోపిస్తున్నారు.    హతుడు రవి కుమారుడు రాజేష్, కుమార్తె ప్రసన్న, తమ్ముడు వరసైన వాసు ఆదివారం మీడియాను కలిసి తమగోడు వెళ్ళబోసుకున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం... జ్యోతి, గ్రామానికి చెందిన పి. పాపారావుకు అక్రమ సంబంధం ఉందన్న విషయం హతుడు రవికి తెలుసన్నారు.ఈ విషయంపైనే తరచూ వారి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. రవి కష్టార్జితం లక్ష రూపాయిలు పాపారావు అప్పుగా తీసుకొని డబ్బులు అడిగిన సందర్భంలో రాసిచ్చిన ప్రామిసరీ నోటును కూడా చించేసి దుర్భాషలాడారన్నారు. ఈ   క్రమంలోనే రవిని పథకం ప్రకారమే హత్య చేశారని, ఈ పథకంలో జ్యోతి, పాపారావుతో పాటు మరికొందరి హస్తం ఉందని కూడా వారు ఆరోపిస్తున్నారు. రవిని హత్య చేసిన అనంతరం మన్నవ దొప్పలపూడి గ్రామానికి మధ్య కొంతమంది వ్యక్తులు శవాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్య తీశారని, శవాన్ని మాయం చేయలేక జ్యోతి పోలీసులకు లొంగిపోవడంతో హత్యకు సహకరించిన నిందితులు పరారయ్యారని చెపుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న జ్యోతి, పాపారావులను కోర్టుకు హాజరుపరచగా వారికి రిమాండ్‌ విధించారని, అయితే బయట ఉన్న వారివల్ల తమకు ప్రాణహాని ఉందని, ఆదివారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో తమ గోడు వెళ్ళబోసుకున్నామని వారు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement