గోవిందపల్లెలో జంట హత్యలు | twin murders in govindapalle | Sakshi
Sakshi News home page

గోవిందపల్లెలో జంట హత్యలు

May 6 2017 11:56 PM | Updated on May 29 2018 4:37 PM

గోవిందపల్లెలో జంట హత్యలు - Sakshi

గోవిందపల్లెలో జంట హత్యలు

మండలంలోని గోవిందపల్లె గ్రామం నుంచి మసీదుపురం వెళ్లే అడ్డరోడ్డులో శనివారం రాత్రి జంటహత్యలు కలకలం రేపాయి.

- మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, అతని బామ్మర్ది శ్రీనివాసరెడ్డి దారుణహత్య
 
శిరువెళ్ల/రుద్రవరం: మండలంలోని గోవిందపల్లె గ్రామం నుంచి మసీదుపురం వెళ్లే అడ్డరోడ్డులో శనివారం రాత్రి జంటహత్యలు కలకలం రేపాయి. ఘటనలో మండల వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీపీ ఇందూరు ప్రభాకర్‌రెడ్డి(52), ఇతని బామ్మర్తి శ్రీనివాసరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి రోడ్డు పక్కనున్న పంట కాల్వలో పడేశారు. వీరిద్దరూ రోజులాగానే శనివారం రాత్రి వాకింగ్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సమయంలో ఈ హత్య జరిగినట్లు ఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తోంది. అయితే వాకింగ్‌కు వెళ్లిన ఇద్దరూ చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా శ్రీనివాసరెడ్డికి ఫోన్‌ చేశారు. రింగ్‌ అవుతున్నా తీయకపోవడంతో ఆందోళన చెందారు. బంధువులతో కలిసి వెళ్లి చూడగా పంట కాల్వలో విగజీవులుగా కనిపించారు. శ్రీనివాసరెడ్డి మృతదేహంపై వరిగడ్డి కప్పి ఉండగా.. ప్రభాకర్‌రెడ్డి మృతదేహం కాల్వలో బోర్లా పడి ఉండటం గుర్తించారు.
 
సీఐ ప్రభాకర్‌రెడ్డి, డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత గంగుల బిజేంద్రారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన డీఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇదిలాఉండగా సుమారు 30 ఎళ్ల క్రితం ప్రభాకర్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డిని ఆళ్లగడ్డలో భూమా వర్గం హత్య చేయడం గమనార్హం. ఆ తర్వాత గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోయినా తాజాగా జరిగిన జంట హత్యలు చర్చనీయాంశంగా మారాయి. గంగుల వర్గం ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement