హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం | TRS government has ignored the promisess | Sakshi
Sakshi News home page

హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

Aug 4 2016 10:13 PM | Updated on Mar 29 2019 9:31 PM

హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం - Sakshi

హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

నల్లగొండ టూటౌన్‌ : జిల్లాను కేంద్రంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసి 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు.

నల్లగొండ టూటౌన్‌ : జిల్లాను కేంద్రంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసి 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు ఆడిటోరియంలో జరిగిన బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వమేర్పడి రెండు సంవత్సరాలు దాటినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోర వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాల్లో జిల్లాకు ఒరిగిందేమి లేదన్నారు. జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ఉన్న రైతులు అల్లాడిపోతున్నారని, ఫ్లోరైడ్‌ సమస్య కూడా జిల్లాలోని ప్రజలను పట్టి పీడిస్తుందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు దాటినా నేటికి రుణమాఫీ అమలు చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు. సర్కారు నిర్ణయాలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా మార్పు రాకపోవడం శోచనీయమన్నారు.  2019 ఎన్నికల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.  పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి మోదీ పథకాలు అనే నినాదంతో సెప్టెంబరు నెల నుంచి ప్రజా క్షేత్రంలోకి వెళతామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ఎద్దు ఎపుసం లేని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి 9 గంటలు కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. వర్షాలు కురిసి నీరు పుష్కలంగా ఉన్నప్పుడు 9 గంటల విద్యుత్‌ ఇస్తే అది గొప్ప అన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు బీజేపీ ప్రజలపక్షాన ఉద్యమం చేస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, నాయకులు జి.మనోహర్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్‌యాదవ్, పాదూరి కరుణ, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, శ్రీరామోజు షణ్ముఖ, ఓరుగంటి రాములు, పల్లెబోయిన శ్యాంసుందర్, నూకల వెంకటనారాయణరెడ్డి, బాకి పాపయ్య, కంకణాల శ్రీధర్‌రెడ్డి, దొంతూరి శ్రీధర్‌రెడ్డి, సునీత, బండారు ప్రసాద్, కౌన్సిలర్లు మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, బొజ్జ నాగరాజు, రావుల శ్రీనివాస్‌రెడ్డి, పోతెపాక సాంబయ్య, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, పెరిక మునికుమార్, బొజ్జ శేఖర్, చింతల సుజాత, ఎస్‌.కె.బాబా తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement