
ఎంత కష్టం... ఎంత ఘోరం..
ఒకే ఊరికి చెందిన వారంతా ఒకేచోట పనిచేస్తున్నారు. తోడునీడగా మెలిగి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. పని చేస్తున్న చోటే మురుగునీటిని శుభ్రం చేసేందుకు ట్యాంకులోకి దిగి ఊపిరాడక మృత్యువాత పడ్డారు.
► చెన్నైలోని ఓ హోటల్ ట్యాంకులో విషవాయువుకు బలి
► విషయం తెలుసుకున్న లక్ష్మీపురంలోని కన్నవారి రోదన
► హుటాహుటిన చెన్నై బయలుదేరిన కుటుంబాలు
వారంతా నిరుపేదలు. అందులో ఓ ముగ్గురు ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టపోషణకు వలసబాట పట్టారు. రోజంతా కాయకష్టం చేసి... సంపాదించిన దాంట్లో కొంత స్వగ్రామంలోని కన్నవారికి పంపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న ఆ యువకులు హఠాత్తుగా కన్నుమూశారు. వారిపైనే ఆధారపడిన ఆ కుటుంబాలు నేడు దిక్కుతోచక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. పెళ్లీడుకు రాకుండానే... ప్రాణాలు కోల్పోయిన తనయులను తలచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నాయి. ఆదుకుంటున్న పిల్లలు అందని తీరాలకు చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి.
విజయనగరం జిల్లా : ఒకే ఊరికి చెందిన వారంతా ఒకేచోట పనిచేస్తున్నారు. తోడునీడగా మెలిగి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. పని చేస్తున్న చోటే మురుగునీటిని శుభ్రం చేసేందుకు ట్యాంకులోకి దిగి ఊపిరాడక మృత్యువాత పడ్డారు. చెన్నైలోని పెరంబూరులో చోటు చేసుకున్న ఈ సంఘటనలో మృత్యువాత పడిన ముగ్గురూ సీతానగరం మండలం లక్ష్మీపురానికి చెందిన వారే. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన పడ్డ సత్యనారాయణ(22), పువ్వల రామకృష్ణ (20), చప్ప వినయ్(22)లు చెన్నెలోని మూడేళ్ళుగా సంగీతా రెస్టారెంట్లో పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకుని నివాసస్థలానికి వెళ్తున్న సమయంలో హోటల్ మేనేజరు పిలిచి హోటల్ను ఆనుకుని ఉన్న మురుగునీటి ట్యాంకు శుభ్రం చేయమని పురమాయించాడు. తొలుత రామకృష్ణ అందులో దిగి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో వినయ్ వెళ్లాడు. తానూ రాకపోవడంతో చివరిగా సత్యనారాయణ దిగాడు. ముగ్గురూ అందులోంచి తిరిగి రాకపోవడంతో విషవాయువు ప్రభావంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై మృత్యువాతపడ్డారని నిర్ధారించుకున్నారు.