
టీడీపీ పనైపోయింది
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనైపోయిందని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఆ పార్టీకి తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని కేంద్ర....
గూడూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనైపోయిందని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఆ పార్టీకి తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన పట్టణంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో జిల్లాలోని ప్రజలు తాగునీటి కష్టాలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా గాజులదిన్నె, సుంకేసుల ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తాగునీటి అవసరాలను కూడా పట్టించుకోకుండా ఖరీఫ్ సీజన్లో అధికారులు ఇష్టం వచ్చినట్లుగా నీటిని విడుదల చేశారన్నారు.
కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అభివృద్ధి పనులను పక్కకు పెట్టి ధనార్జనే ధ్వేయంగా పని చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి జపం చేస్తూ ప్రజల సంక్షేమం గాలికొదిలేసారని విమర్శించారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్.సుధాకరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎం.చరణ్కుమార్, డీసీసీ కార్యదర్శి గుడిపాడు ఆర్.చంద్రారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు కెవీ కృష్ణా రెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు కె.తులసీకృష్ణ, డెరైక్టర్ నాగార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.