
అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు దారుణం
అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు దారుణమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు .
► 41 సమస్యలను లేవనెత్తాం..
► రాయచోటి సమస్యలపై మాట దాటవేసిన ప్రభుత్వం
► మదరసాలకు బోర్టు, యూనివర్సిటీకి డిమాండ్ చేశాం
► రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి
రాయచోటి రూరల్: అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు దారుణమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు . శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యవహరించిన తీరు చూస్తే బాధగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో 41 ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే అందులో ఏ ఒక్క సమస్యకూ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు.
రాష్ట్రంలో రైతుల విషయం, తాగునీటి సమస్యలు, అగ్రిగోల్డ్, పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్ వంటి విషయాల్లో సరైన సమాధానాలు ఇవ్వలేక మంత్రులు , ముఖ్యమంత్రి ఇరుకునపడ్డారని చెప్పారు. సరైన సమాధానం లేక ప్రతిపక్షంపై వ్యక్తిగత విషయాల్లో ఎదురుదాడికి దిగిందని ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాయచోటికి సంబంధించిన రింగ్రోడ్డు పెండింగ్ పనులు, కృష్ణ జలాలు తీసుకురావడం వంటి విషయాలతో పాటు రాయచోటి ప్రాంతం నుంచి వలస వెళ్లే వేలాది మంది రైతులు, కూలీలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో యాచించే పరస్థితిని వివరించేందుకు అవకాశం దొరికిందన్నారు. అయితే ప్రభుత్వం అందుకు రైతులను కించపరిచే విధంగా ఇతర ప్రాంతాలకు మెరుగైన జీవనం వెళ్లారంటూ అవమానకరంగా మాట్లాడటం దారుణమన్నారు. జనాలకు తాగడానికి, రైతులకు సాగు చేసుకోవడానికి నీరు లేకపోవడం, పశువులకు కనీసం గడ్డి లేకపోవడం వంటి విషయాలు నిత్యం మన కళ్లకు కనబడుతున్నా, ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు వ్యతిరేకంగానే పనిచేస్తోందని గుర్తు చేశారు.
జోన్-4 ఉద్యోగుల పట్ల వివక్ష: రాయలసీమను జోన్-4 గా గుర్తిస్తూ అందులో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు, కానీ ఉద్యోగుల నియామక వాటాలను కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. అన్ని శాఖల్లోనూ సీనియారిటీ ప్రకారం పదోన్నతలు కల్పించడం లేదన్నారు. ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావించినా సంబంధిత మంత్రి గారు స్పందించలేదన్నారు. ఇన్ని విషయాలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లినా ఏ ఒక్కదానికి సరైన సమాధానం రాకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై బాధ కలుగుతోందన్నారు.
మదరసాలకు బోర్టు ఏర్పాటు చేయాలి..: మైనార్టీ పిల్లల అబివృద్థి కోసం, వారి ఇస్లామిక్ చదువుల కోసం ఏర్పాటు చేసిన మదరసాలు అన్నింటినీ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి తెలిపారు. మదరసాలకు బోర్డు గుర్తింపు ఇచ్చి, ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. మదరసాల్లో నాణ్యమైన విద్యను పిల్లలను అందించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.