శాంతిస్థాపన కోసమే శివలింగ మందిరం | Sakshi
Sakshi News home page

శాంతిస్థాపన కోసమే శివలింగ మందిరం

Published Wed, Jan 18 2017 10:08 PM

sivalingam mandiram in puttaprthy

పుట్టపర్తి అర్బన్‌ : ప్రపంచ వ్యాప్తంగా శాంతి కిరణాలను ప్రసరింపజేయడానికి శివలింగ మందిరాలు, బ్రహ్మకుమారీ ఈశ్వరీయ ఓం శాంతి మందిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు లండన్‌ నుంచి విచ్చేసిన ముఖ్య నిర్వాహకులు బ్రహ్మకుమార్‌ రతన్‌దాదా పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి గ్రామంలో నిర్మితమవుతున్న శివలింగ మందిరం నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఓంశాంతి ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ప్రజాపిత బ్రహ్మబాబా స్మృతి దినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం రతన్‌దాదా మాట్లాడుతూ బ్రహ్మబాబా నిత్యం శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటుతూ 140 దేశాల్లో 900కు పైగా ఓంశాంతి కేంద్రాలు స్థాపించారన్నారు. శాంతిదూతగా ప్రచారం చేస్తున్న ఆయనకు యునైటెడ్‌ నేషన్స్‌ పీస్‌ అవార్డుతో పాటు గోల్డ్‌ మెడల్‌తో సత్కరించారని గుర్తుచేశారు. దేశంలో అతి పెద్ద శివలింగ మందిరం (రూ.కోటి వ్యయంతో 75 అడుగుల ఎత్తు) పుట్టపర్తిలో నిర్మితం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈనెల 21న పుష్ప అక్కయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఓంశాంతి ట్రస్టు ప్రతినిధులు లక్ష్మిఅక్కయ్య, గోపి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement