ఎమ్మెల్యే అండతో టీడీపీ నేతల దౌర్జన్యం | Singanamala MLA Yamini Bala Angry on Illuru People | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అండతో టీడీపీ నేతల దౌర్జన్యం

Sep 15 2017 2:03 PM | Updated on Jun 1 2018 8:45 PM

ఎమ్మెల్యే అండతో టీడీపీ నేతల దౌర్జన్యం - Sakshi

ఎమ్మెల్యే అండతో టీడీపీ నేతల దౌర్జన్యం

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి.

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అడిగిన జనంపై విరుచుకుపడటం టీడీపీ నాయకులకు నిత్యకృత్యంగా మారింది. తాజాగా అనంతపురం శింగనమల టీడీపీ ఎమ్మెల్యే యామిని బాల శుక్రవారం రైతులు, మహిళలపై శివమెత్తారు. నీళ్లు ఇవ్వాలని, రుణాలు మాఫీ చేయాలని అడినందుకు తిట్లదండకం అందుకున్నారు.

ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గార్లదిన్నె మండలం ఇల్లూరులో ఆమె పర్యటించారు. తుంగభద్ర నుంచి నీరు వచ్చేలా చేయాలని రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని మహిళలు.. ఎమ్మెల్యేని అడిగారు. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ.. మీకు బుద్ధి, జ్ఞానం లేదంటూ తిట్టారు. ఎమ్మెల్యే అండతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామంటూ రైతులు, మహిళలను టీడీపీ నేత రామాంజనేయ బహిరంగంగా హెచ్చరించారు. ఇంతజరుగుతున్నా పోలీసులు ఏమీపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం.

టీడీపీ నేతల దౌర్జన్యంపై స్థానికులు మండిపడుతున్నారు. మహిళ అయివుండి సాటి మహిళలపై ఎమ్మెల్యే యామిని బాల ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement