బియ్యంపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రద్దు చేయాలని ఏపీ రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
విజయవాడ : బియ్యంపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రద్దు చేయాలని ఏపీ రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక రైస్మిల్లర్స్ అసోసియేషన్ హాలులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బియ్యంపై 5 శాతం పన్ను విధించడం సరికాదన్నారు.
ఆహార ధాన్యాలపై జీఎస్టీ విధించబోమని చెబుతూనే దొడ్డిదారిన బియ్యంపై పన్ను విధించారని మండిపడ్డారు. బ్రాండెడ్ వెరైటీలకు మాత్రమే పన్ను విధిస్తున్నట్లు చెబుతున్నారని, దీనివల్ల ప్రజలు బ్రాండెడ్ వెరైటీలు ఏవో తెలుసుకోలేక అయోమయానికి గురవుతారన్నారు. సాధారణ రకాలను బ్రాండెడ్ వెరైటీలుగా చూపించి ప్రజలను మోసగించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ రైస్ ఓ అభూతకల్పనని కొట్టిపారేశారు. ప్లాస్టిక్ రైస్ తయారీ సాధ్యం కాదన్నారు. ఇంతవరకు ప్లాస్టిక్ రైస్ తయారు చేసే మెషినరీ ఏదీ అందుబాటులో లేదని స్పష్టం చేశారు. దేశమంతటా. «వరి ధాన్యం ఉత్పత్పి సరిపడినంత ఉండగా ప్లాస్టిక్ రైస్ తేవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ప్లాస్టిక్ రైస్ ఉన్నాయని నిరూపిస్తే ఒక్కో క్వింటాల్కు రూ. 50వేల చొప్పున అసోసియేషన్ తరపున పారితోషం అందజేస్తామని ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు వీరయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షుడు భాస్కరరావు, కో ఆర్డినేటర్ షేక్ బాజీ పాల్గొన్నారు.