రమణీయం..రథోత్సవం | rathochavam in devaragattu | Sakshi
Sakshi News home page

రమణీయం..రథోత్సవం

Oct 13 2016 10:54 PM | Updated on Sep 4 2017 5:05 PM

రమణీయం..రథోత్సవం

రమణీయం..రథోత్సవం

దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవం గురువారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు.

హొళగుంద/ఆలూరు రూరల్‌: దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవం గురువారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. నెరణికి గ్రామ పురోహితులు స్వామి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెరణికి, నెరణికితండా, కొత్తపేట, బిలేహాల్‌ తదితర గ్రామపెద్దలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు మేళతాళాలతో ఆలయం ప్రాంగణంలో ఉన్న సింహాసన కట్ట నుంచి ఎదురు బసవన్న ఆలయం వరకు రథోత్సవాన్ని లాగారు. ఈ సందర్భంగా రథం ముందు గొరవయ్యలు నృత్యాలు చేశారు. రథోత్సవంలో ఆలూరు నియోజకవర్గం నుంచేగాక కర్ణాటక, అలాగే మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఐ శంకరయ్య ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు.
 
 నేడు గొలుసుతెంపు కార్యక్రమం
మాళమల్లేశ్వరస్వామి సన్నిధానంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సింహాసనం కట్టపై ఉన్న మాళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఎదుట గొరవయ్యలు గొలుసులు తెంచే కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక్కొక్కరు భక్తితో సింహాసనం కట్టకు ఉన్న ధ్వజస్తంభాలకు కట్టిన గొలుసులను తెంచే ప్రయత్నం చేస్తారు. అలా దాదాపు ఆ కార్యక్రమం నాలుగు గంటల పాటు సాగుతుంది. చివరికి భక్తితో ఒక్క గొరవయ్యే ఆ గొలుసును తెంచుతాడు. ఆలూరు నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో దేవదాసీలు కూడా సింహాసనం కట్టకు వందల సంఖ్యలో చేరుకుంటారు. తెల్లటి వస్త్రాలు ధరించి నృత్యాలు చేస్తారు. అలా  చేసిన నృత్యాలను స్వయంగా మల్లేశ్వరుడు సింహాసనం కట్ట దగ్గర కూర్చొని తిలకిస్తాడని దేవదాసీలు భావిస్తారు. 
 

Advertisement

పోల్

Advertisement