ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం..! | private buses accidents in andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం..!

Jul 6 2016 9:17 AM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రైవేట్ బస్సులు అదుపుతప్పుతున్నాయి. నిత్యం రోడ్లపై తిరగాల్సిన బస్సులు చెట్లను ఢీకొట్టడం, డివైడర్లు ఎక్కటం లాంటివి చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

  • మామూళ్ల మత్తులో రవాణా శాఖ
  • రోడ్డెక్కుతున్న ఫిట్‌నెస్‌లేని బస్సులు
  • అదుపు తప్పుతున్న ప్రైవేట్ బస్సులు

  • ప్రైవేట్ బస్సులు అదుపుతప్పుతున్నాయి. నిత్యం రోడ్లపై తిరగాల్సిన బస్సులు చెట్లను ఢీకొట్టడం, డివైడర్లు ఎక్కటం లాంటివి చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీసులు సైతం కళ్లెం వేయలేకపోతున్నారు. పర్యవసానంగా ఆభంశుభం తెలియని ప్రయాణికులు బలి అవుతున్నారు.
     
    విజయవాడ : గత కొన్నేళ్లుగా ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా జిల్లాలోని జాతీయ రహదారిపై ఈపరిస్థితి అధికంగా ఉంది. అనుభవం లేని డ్రైవర్లు, క్లీనర్లకు డ్రైవింగ్ బాధ్యతలు అప్పగించటం, బస్సులకు స్పీడ్ లాక్ లేకపోవటం వెరసి ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నార ుు. జిల్లాలో మొత్తం 410 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర జిల్లాలో రిజిస్ట్రేషన్లు జరిగి ఇక్కడ రాకపోకలు నిర్వహించే బస్సులు మరో 300 వరకు ఉన్నాయి.
     
    బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో రవాణా శాఖ అధికారుల నిబంధనల్ని ప్రైవేట్ ఆపరేటర్లు కాసులతో సరిపెడుతుండటంతో ఫిట్‌లెస్ బస్సులకు కూడా సర్టిఫికెట్లు ఆఘమేఘాల మీద వస్తున్నాయి. ఇటీవల కంచికచర్లలో అర్ధరాత్రి సమయంలో కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న కార్తీక ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులోని బ్యాటరీ ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ నిద్రపోతున్న ప్రయాణికులను అప్రమత్తం చేయటంతో వెంటనే వారందరు బస్సులో నుంచి దిగిపోయారు.
     
    ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పెనుప్రమాదం మాత్రం తప్పింది. ఈఏడాది మార్చి 15న అమలాపురం నుం చి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. గొల్లపూడి సమీపంలోని సూరాయపాలెం వద్ద డ్రైవర్ పూటుగా మద్యం తాగడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.

    ఈఘటనలో డ్రైవర్‌తోపాటు ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు మెడికోలు మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో  చర్చనీయాంశమైంది.  ఈ ఘటన జరిగినప్పుడు రవాణా, పోలీసులు అధికారులు కొంత హడావుడి చేసి కేసులు నమోదు చేసి, ఆ తర్వాత రెండు రోజులకే దీనిని మరిచిపోయారు. ఇదే తరహాలో ప్రమాదాలు అనేకం జరగుతున్నాయి.
     
    చర్యలు శూన్యం
    ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ అధికారులు  చర్యలు తీసుకుంటున్న దాఖాలాలు లేవు. ముఖ్యంగా అన్ని బస్సులకు స్పీడ్ లాక్ పెట్టకపోవటం, జాతీయ రహదారిపై వాహన వేగాన్ని పరిశీలించే స్పీడ్‌గన్లు వినియోగించటకపోవటం, వాహన సామర్థ్యాన్ని పరీక్షించటంతోపాటు, డ్రైవర్ సామర్థ్యాన్ని పరీక్షించటం, అతని దృష్టి లోపం, ఇతర ఇబ్బందుల్ని పరీక్షించటం, వాహనం కండీషన్ చూడటం, కనీసం రెండు వారాలకు ఒకసారైనా బస్సు డ్రైవర్‌ను బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించటం తదితర కార్యక్రమాలు నిర్వహించాలి.
     
    ఏటా వేల సంఖ్యలో ప్రమాదాలు
    జిల్లాలో సగటున ప్రతి ఏటా 2800 వాహన ప్రమాదాలు జరగుతున్నాయి. వీటిలో 25 శాతం ప్రమాదాలు ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులే ఉంటున్నాయి. వాహన ప్రమాదాల్లో సగటున 700 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement