'ఆ ఆవేదన ఏదో ఒకరోజు ఆగ్రహంలా మారుతుంది' | pilli mankya rao madiga fires on chandrababu | Sakshi
Sakshi News home page

'ఆ ఆవేదన ఏదో ఒకరోజు ఆగ్రహంలా మారుతుంది'

Apr 16 2016 8:20 PM | Updated on Oct 9 2018 5:03 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మాదిగల జపాన్ని చేసి, రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో మాలల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇచ్చిన హామీలను విస్మరించి మాదిగల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ విమర్శించారు.

తెనాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మాదిగల జపాన్ని చేసి, రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో మాలల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇచ్చిన హామీలను విస్మరించి మాదిగల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీకి అండగా ఉన్న మాదిగలకు అన్యాయం చేస్తు కొందరు మాలసోదరులను అందలం ఎక్కిస్తున్నాడన్నారు.

మాదిగలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఆవేదన చెందుతున్నారని, ఆ ఆవేదన ఏదో ఒక రోజు ఆగ్రహంలా మారి టీడీపీని, చంద్రబాబును భూస్థాపితం చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాలలకు, దళితులకు నాయకుడి కాని కారెం శివాజీకి అప్పగించి చంద్రబాబు పెద్ద తప్పుచేశారని ఆరోపించారు. ఆయన వల్ల ఎస్సీ, ఎస్టీలకు భవిష్యత్‌లో న్యాయం జరగకపోగా కమిషన్‌ను చంద్రబాబుకు తొత్తులా మార్చుతారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 18, 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల వద్ద నిరసనలు, రాస్తారోకోలు చేయాలని, 21న ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహనాలు, 23న కలెక్టరేట్‌ల వద్ద అందోళన, సీఎం దిష్టిబొమ్మల దహనాలు చేయాలని శుక్రవారమిక్కడ జరిగిన ఎమ్మార్పీఎస్ అత్యవసర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు.

మాదిగలు, ఉపకులాలవారు, మేధావులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ, జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావుమాదిగ, జిల్లా ఇన్‌చార్జి షాలెంరాజు మాదిగ, రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలకా కిరణ్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement