వైద్యం అందక తల్లీబిడ్డ మృతి | mother and child died | Sakshi
Sakshi News home page

వైద్యం అందక తల్లీబిడ్డ మృతి

Sep 9 2016 11:18 PM | Updated on Sep 4 2017 12:49 PM

మృతి చెందిన ఆషాబీ

మృతి చెందిన ఆషాబీ

108 అంబులెన్స్‌ సేవలు అందక.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తల్లీబిడ్డ ప్రాణం తీసింది. ఆసుపత్రుల్లో ప్రసవం జరిగేలా చూడాలనే ప్రచారం.. ఈ ఘటనతో అపహాస్యమైంది.

స్పందించని 108, ఏఎన్‌ఎం
– పీహెచ్‌సీ ఉన్నా నిరుపయోగం
– 25 కిలోమీటర్ల దూరంలోని బళ్లారి ఆసుపత్రికి పరుగులు
– అర్ధరాత్రి వేళ అగచాట్లు
– ప్రసవంలోనే తల్లీబిడ్డ మృతి
 
హాలహర్వి: 108 అంబులెన్స్‌ సేవలు అందక.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తల్లీబిడ్డ ప్రాణం తీసింది. ఆసుపత్రుల్లో ప్రసవం జరిగేలా చూడాలనే ప్రచారం.. ఈ ఘటనతో అపహాస్యమైంది. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బాబుసాహెబ్‌కు నందవరానికి చెందిన ఆషాబీ(24)తో గత ఏడాది వివాహమైంది. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. గురువారం రాత్రి 12 గంటల సమయంలో పురిటినొప్పులు రాగా.. కాన్పు నిమిత్తం భర్త 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా.. డ్రై వర్‌ లేడని, రెండు గంటల తర్వాత ఫోన్‌ చేయాలనే సమాధానం వచ్చింది. ఆ వెంటనే ఆయన స్థానిక ఏఎన్‌ఎం సుధాకర్‌కు ఫోన్‌ చేయగా.. ఈ సమయంలోనే తాను రాలేనని చెప్పడంతో బాబుసాహెబ్‌ కంగారు పడ్డాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరోసారి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా డ్రై వర్‌ లేడని ఒకసారి, డీజిల్‌ కూడా లేదని మరోసారి సమాధానం వచ్చింది.
 
అర్ధరాత్రి ఆగచాట్లు
భార్యకు పురిటినొప్పులు అధికం కావడంతో బాబాసాహెబ్‌ గ్రామంలోని టాటా ఏస్‌ వాహనాన్ని మాట్లాడుకొని 25 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కేంద్రంలోని ఓపీడీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆషాబీని పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని చెప్పడంతో బంధువులను సంప్రదించగా ఫలితం లేకపోయింది. విషయాన్ని వైద్యులకు చెప్పగా అతి కష్టం మీద ప్రసవం జరిగి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ సందర్భంగా అధిక రక్తస్రావంతో తల్లీబిడ్డ మరణించారు.
 
ఆదుకోని పీహెచ్‌సీ
గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా.. సమీపంలోని హాలహర్వి మండల కేంద్రంలో పీహెచ్‌సీ ఉన్నా సాయంత్రం 5 గంటలు దాటితే ఎవ్వరూ అందుబాటులో ఉండని పరిస్థితి. చుట్టుపక్క ప్రాంతాలకు ఈ విషయం అవగతం కావడంతో వీరంతా బళ్లారి ఓపీడీ ఆసుపత్రిని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఆలూరు నియోజకవర్గం జిల్లా శివారు ప్రాంతం కావడం వల్ల కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 108 సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం కూడా గర్భిణి మృతి కారణమైంది. ఇదిలాఉంటే కాంట్రాక్టు గడువు ముగియడం వల్లే 108 సిబ్బంది అర్ధరాత్రి స్పందించలేదనే చర్చ జరుగుతోంది. ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భర్త బాబుసాహెబ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement