డ్యూటీ డాక్టర్ విధుల్లోలేకపోవడంతో ఘటన
విచారణ చేపడతాం: డీఎంహెచ్వో వెల్లడి
గుండాల: డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి నర్సు చికిత్స చేయడంతో పుట్టిన శిశువు మరణించగా, అనంతరం బాలింత కూడా కన్నుమూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శంభునిగూడెం గ్రామానికి చెందిన దాట్ల వనజ (20) నిండు గర్భిణి కాగా ఆదివారం తెల్లవారుజామున పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వైద్యుడు అందుబాటులో లేరు.
ఇది 24 గంటల ఆస్పత్రి కాగా, ఇద్దరు వైద్యులకుగాను ఒకరు పీజీ కోసం కొన్నాళ్ల క్రితం వెళ్లగా ప్రస్తుతం ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు. వనజను తీసుకొచ్చిన సమయంలో అందుబాటులో ఉన్న ఒకే ఒక్క నర్సు ప్రసవం చేయగా, పుట్టిన ఆడశిశువులో కదలికలు కానరాలేదు. దీంతో ఆక్సిజన్ పెట్టి ఇల్లెందు ఆస్పత్రికి తరలించగా అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలా ఉండగానే వనజకు తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమిస్తుండటంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ వనజ సైతం సోమవారం రాత్రి కన్నుమూసింది.
కళ్ల ముందే ఇద్దరు మృతదేహాలుగా మారడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గుండాల ఆస్పత్రి వైద్యులు సమయానికి లేకపోవడమే ఇందుకు కారణమని వనజ తండ్రి, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. ఘటనపై వివరణ కోసం ఆస్పత్రి వైద్యుడు సుదీప్ వివరణ కోనం ఫోన్లో ప్రయత్నించగా స్పందించలేదు.
కాగా, గుండాల ఆస్పత్రిలో జరిగిన ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి తుకారాం రాథోడ్ను వివరణ కోరగా.. బాలింత, శిశు మరణంపై వైద్యుడు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించి విచారణ చేపడుతామని తెలిపారు. కాగా, గర్భిణీకి పురిటి నొప్పులు మొదలైనప్పుడు 108కు సమాచారం ఇచ్చినా వాహనం మరో చోటకు వెళ్లడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకురావడంలో ఆలస్యం జరిగి ఉండొచ్చని వెల్లడించారు. ఆస్పత్రిలో సైతం ఒకే వైద్యుడు ఉండగా, సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారని తెలిపారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నియామకాలకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


