ఇక ‘పెద్దల’ పోరు' | mlc elctions in telangana on december 27th | Sakshi
Sakshi News home page

ఇక ‘పెద్దల’ పోరు'

Nov 25 2015 11:48 AM | Updated on Aug 29 2018 6:26 PM

ఇక ‘పెద్దల’ పోరు' - Sakshi

ఇక ‘పెద్దల’ పోరు'

‘పెద్దల’ పోరుకు తెరలేచింది. జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలోని రెండు శాసనమండలి స్థానాలకు నగారా మోగింది.

రంగారెడ్డి జిల్లా: ‘పెద్దల’ పోరుకు తెర లేచింది. జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలోని రెండు శాసనమండలి స్థానాలకు నగారా మోగింది. డిసెంబర్ 27న జరిగే ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ప్రకటించింది. కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహించిన పట్నం నరేందర్‌రెడ్డి ఈ ఏడాది మే 1న పదవీ విరమణ చేయడంతో ఆ సీటు ఖాళీ అయింది.

 

ఈ స్థానంతో పాటు రాష్ట్ర పునర్విభజనలో జిల్లాలో అదనంగా పెరిగిన స్థానానికి ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. స్థానిక సంస్థల్లో సాంకేతికంగా కాంగ్రెస్, టీడీపీలకే బలం ఉన్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణలు మారిపోయాయి. చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ‘గులాబీ’ గూటికి చేరడంతో సంఖ్యాబలాల్లో భారీ తేడా వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలు పావులు కదుపుతున్నాయి.
 

ఒక ఓటరు.. రెండు ఓట్లు
ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలకు ఓ విశిష్టత ఉంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒకేసారి రెండు స్థానాలకు పోలింగ్ జరుగుతుండడంతో ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రతి సభ్యుడు ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేస్తారని, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో రెండు బ్యాలెట్ బాక్సులు ఉంటాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల కోటాలో 769 మంది ఓటుహక్కు వినియోగించుకోన్నారు. మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు సహా మరో ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు.

 

పురపాలక పాలకవర్గాల్లో సభ్యత్వం కలిగిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో మంచి రెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), సంజీవరావు (వికారాబాద్), మహేందర్‌రెడ్డి(తాండూరు), తీగల కృష్ణారెడ్డి(మహేశ్వరం), సుధీర్‌రెడ్డి (మేడ్చల్)కి ఓటు హక్కు ఉంది. ఇదిలా ఉండగా, గ్రేటర్‌కు పాలకవర్గం లేకపోవడంతో దీని పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఫలితంగా 48 డివిజన్ల కార్పొరేటర్లు ఓట్లు లేకుండానే ఇద్దరు సభ్యులు ‘పెద్దల’సభలోకి ప్రవేశించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement