కమనీయం..మహానందీశ్వరుడి కల్యాణం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం వేకువ జామున మహానందీశ్వరస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మహానంది: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం వేకువ జామున మహానందీశ్వరస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలకరించారు. కల్యాణ వేదికపై ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ తంతను శాస్త్రోక్తంగా జరిపారు. కల్యాణోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించారు. కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి..నూతన వధూవరులుగా భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు, ఆదిలక్ష్మమ్మ దంపతులతో పాటు నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.
మయూరవాహనంపై మహానందీశుడు..
కల్యాణం అనంతరం శనివారం ఉదయం మయూరవాహనంపై మహానందీశ్వర స్వామి కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. వేలాది మంది భక్తజనంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన దర్శనం రాత్రి వరకు నిర్విరామంగా సాగింది.