
'నేను రెడీ.. బెయిల్ కూడా వద్దు'
తనకు అవకాశం ఇస్తే.. ఇంట్లో లేదంటే జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ముద్రగడ పద్మనాభం అన్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10గంటల మధ్య తన సతీమణితో కలిసి దీక్షలో కూర్చుంటానని అన్నారు.
తూర్పుగోదావరి: తనకు అవకాశం ఇస్తే.. ఇంట్లో లేదంటే జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ముద్రగడ పద్మనాభం అన్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10గంటల మధ్య తన సతీమణితో కలిసి దీక్షలో కూర్చుంటానని అన్నారు. తన జీవితాన్ని కాపులకు అంకితం చేస్తానని అన్నారు. ఈ ఉద్యమం కోసం తన ప్రాణంపోతే సంతోషిస్తానని, తను చనిపోయిన తర్వాతనైనా కచ్చితంగా తమ జాతికి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కావాలనే కాపులు ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చారని, దీని వెనుక కొన్ని పార్టీల హస్తం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడంపట్ల ఆయన సోమవారం కిర్లంపూడిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
తాము శాంతియుతంగా రాస్తారోకో, రైల్ రోకో కోసం రోడ్లపైకి వచ్చామని, తమకంటే ముందుగానే కొన్ని అసాంఘిక శక్తులు రోడ్లపైకి చేరి ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నించాయని అన్నారు. వీటికి కొన్ని మీడియా సంస్థలు తోడయ్యాయని చెప్పారు. తమ మనుషుల ప్రమేయం లేకుండానే పెట్రోల్ బాంబులతో ఓపక్క రైలుపైన, మరోపక్క రాత్రి పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారని చెప్పారు. ఆ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని, టీడీపీ అధికార ప్రతినిధుల హస్తం ఈ దాడుల వెనుక ఉందని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
- మీడియా ద్వారా మాపై దాడులు చేశారు
- దాడుల చేసే అలవాట్లు మాజాతికి అలాంటి అలవాట్లు లేవు
- కొన్ని దుష్టశక్తులతో ఆ పనిచేయించారు
- అధికారిక పార్టీ ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు
- ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఈ పనిచేయించారు
- మరింత చెడుగా దీన్ని మారుస్తారని తన దీక్షను విరమించాను
- టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారందరిపై కేసులు పెట్టాలని అనుకుంటున్నారు.
- మా ఉద్యమంలో చెడుసంఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత
- నేను ఉద్యమాన్ని మాత్రమే నడుపుతున్నాను.. నాపై బురద జల్లడం మానుకోండి
- ముఖ్యమంత్రి తప్పుడు మార్గం అనుసరిస్తున్నారు
- తప్పుడు మాటలు చెప్పి గద్దెనెక్కారు
- మాకు ఇచ్చిన హామీ మరిచారు కాబట్టే ఉద్యమం చేస్తున్నాం.. రోడ్లెక్కుతున్నాం
- ఎన్నో జాతులను చంద్రబాబునాయుడు మోసం చేశారు.. రైతుల మాఫీ అన్నారు అది పక్కకు పోయింది. డ్వాక్రా అన్నారు అదీ అంతే అయింది, జాబులు అన్నారు గాలికిపోయింది.
- విధ్వంసానికి కుట్రలు చేసింది అధికారపార్టీనే. చంద్రబాబు పంగనామాలు పెట్టడం మాని అబద్ధాలు నిజం చేయాలి.
- గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీకన్నా దారుణంగా ఉంది
- సీఎం అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు
- ప్రత్యేక విమానాలకు కోట్లకు కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి
- ప్రపంచంలో గొప్ప టెక్నాలజీ మీ దగ్గర ఉంది.. మా జాతకాలు అందులో ఉన్నాయి
- గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు దొంగ జీవోలు అనడం సరికాదు.
- గాల్లో తిరుగుతూ మా జాతిని గాలికి వదిలేస్తున్నారు
- మా పిల్లలు మధ్యాహ్నం బోజనంకోసం స్కూల్ కు పంపిస్తున్నాం.
- వెంటనే జీవో జీవోను ఇవ్వండి
- లేదంటే .. నేను రెడీగా ఉన్నాను.. ఎన్ని సెక్షన్లయినా పెట్టుకోండి
- బెయిల్ కూడా తెచ్చుకోను.. కాపు జాతికి నా జీవితం అంకితం.. నా జాతికి న్యాయం చేస్తాను.. ఎక్కడికీ పారిపోను. ఆమరణ దీక్ష చేస్తాను.
- ప్రతి గ్రామంలో మద్యాహ్నం ఒక పూట భోజనం మాని పల్లేలతో రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలపండి
- ఇంట్లో అనుమతిస్తే నేను నాభార్య కలిసి దీక్ష చేస్తాం.. లేదంటే మహిళల జైలులో నా భార్య, వేరే జైలులో నేను దీక్ష చేస్తాను