24 నుంచి ఈరన్నస్వామి ఉత్సవాలు
అందరం సమన్వయంతో పని చేసి ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణమాస ఉత్సవాలను విజయంతం చేద్దామని ఆదోని ఆర్డీఓ ఓబులేష్ వివిధశాఖల అధికారులను ఆదేశించారు.
- నెలరోజుల పాటు నిర్వహణ
- భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి
- వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో ఆర్డీఓ
కౌతాళం: అందరం సమన్వయంతో పని చేసి ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణమాస ఉత్సవాలను విజయంతం చేద్దామని ఆదోని ఆర్డీఓ ఓబులేష్ వివిధశాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం దేవాలయ ఆవరణలోని కాలక్షేప మంటపంలో ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ నెల 24నుంచి ఆగష్టు 21వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. అన్ని శాఖల అధికారులతో పాటు గ్రామస్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు భక్తులకు తమవంతు సహయ సహకారం అందించాలని కోరారు.
నెల రోజుల పాటు దేవాలయం వద్ద విద్యుత్ కోత లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఇందుకు అదనంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు పుణ్యస్నానాలు అచరించే తుంగభద్ర దిగువ కాలువలో నిత్యం నీరు ఉండేల చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని దేవస్థానం ఈఓ మల్లికార్జున ప్రసాద్కు, చైర్మన్ చెన్నబసప్ప, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కోరారు. ఉరుకుందకు వచ్చే అన్ని రోడ్లను మరమ్మతులు చేయాలని రోడ్డు భవనాలశాఖ అధికారులకు, బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. స్వామి దర్శనానికి సుమారు 15నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఈఓను ఆదేశించారు. ఆలయ ఆవరణలో వైద్య శిబిరాలు, పోలీస్బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు చెప్పారు.
ఉత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల
శ్రావణమాస ఉత్సవాల ఆహ్వాన పత్రికను చైర్మన్ చెన్నబసప్ప, ఆర్డీవో, డీఎస్పీ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ నెల 24నుంచి ఆగష్టు 21వరకు జరిగే ఉత్సవాల్లో ఐదు సోమవారాలు, నాలుగు గురువారాలు వస్తాయని ఈఓ మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. సమావేశంలో తహస్లీల్దారు షేక్షావలి, సీఐ దైవప్రసాద్, ఎస్ఐ సుబ్రమణ్యంరెడ్డి, ట్రాన్స్కో ఏడీఈ రంగయ్య, ఏఈ మద్దిలేటి, ఎంపీపీ లక్ష్మి, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ ముత్తమ్మ, పాలక మండలి çసభ్యులు, ఆలయ పర్యవేక్షకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.