'బాబు దుష్ట పన్నాగానికి దిగారు'


గుంటూరు: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోర వైఫల్యం చెందారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రం దుర్భిక్షంలో ఉంటేనే తన దుష్టపన్నాగాలు అమలవుతాయని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతుల మాట్లాడుతూ రైతుల దుస్థితిని ఆయుధంగా వాడుకుని, వారికి భ్రమలు కల్పించి చంద్రబాబునాయుడు మోసం చేశారని చెప్పారు.



యువతను కూడా ఉద్యోగాలిస్తామని.. నిరుద్యోగ ఉదృతి భృతి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా పక్కకు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని, అది తెచ్చి ఎవరికి పెడతారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని, తనకు ఎక్కడ లంఛాలు రావో అని పోలవరం పక్కకు పెట్టేశారని, దానిని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానని అంటున్నారని చెప్పారు.



కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం లేకుంటే పోలవరం పూర్తి కాదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. పోలవరం కాలువ వైఎస్ తవ్విస్తే దానిని ప్రారంభించి తానేదో గొప్పలు సాధించినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నాడని ఆయన చేసిందేమీ లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుందని, అయినా దీక్ష కొనసాగించి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఓటుకు నోటు కేసుల కుంభకోణంలో ఇరుక్కుని చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని చెప్పారు.





 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top