దారితప్పిన ప్రేమకు హత్యతో ముగింపు

Woman Murdered With Fornication Relation Karnataka - Sakshi

ఇతరులతో మాట్లాడిన మహిళ

తట్టుకోలేక హత్య చేశానన్న ప్రియుడు  

వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ  

ఆమె వయసు 32, అతని వయసు 24. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఒంటరిగా ఉంటోంది. యువకునితో ప్రేమలోపడింది. అనుమానాలు తలెత్తి ఆమె హత్యకు దారితీశాయి. సమాజంలో నేటి పెడ పోకడలకు ఈ సంఘటన అద్దం పడుతోంది.  

కర్ణాటక, హొసూరు: జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో దుకాణంలో విధులు నిర్వహిస్తున్న మహిళను దారుణంగా హత్య చేసిన ప్రియుడు పోలీసులకు లొంగిపోయాడు. అతడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నివ్వెరపరిచే నిజాలు బయటపెట్టాడు. క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని కరుకన్‌సావడి గౌండనూర్‌కొటాయ్‌ గ్రామానికి చెందిన సెల్వి(32). ఈ మెకు 13, 11 ఏళ్ల వయసు ఇద్దరు పిల్లలున్నారు. ఇరువురూ కావేరిపట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో  9వ తరగతి, 6వ తరగతి చదువుతున్నారు. భర్తను వదలి నివసిస్తున్న సెల్వి క్రిష్ణగిరి జక్కప్పన్‌ నగర్‌లోని ఓ గిఫ్ట్‌ల దుకాణంలో పనిచేస్తూ వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దారుణహత్యకు గురైంది. 

నిందితుడు దౌలత్‌ ఏమన్నాడంటే   
నిందితుడు కావేరిపట్టణం అన్నానగర్‌కు చెందిన దౌలత్‌ (24) పోలీసులకు లొంగిపోయాడు. అతన్ని విచారించగా, ఇద్దరూ కావేరిపట్టణంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ వచ్చామని ఈ సమయంలో ఇరువురి మధ్య ప్రేమ ఏర్పడిందని, అప్పటి నుండి తన సంపాదన పూర్తిగా సెల్విచేతికే ఇచ్చేవాడినని తెలిపాడు. శనివారం మధ్యాహ్నం తనకు ఫోన్‌ చేసిన సెల్వి రూ. 2 వేలు అడిగిందని, డబ్బులు తీసుకొని ఆమె పనిచేస్తున్న దుకాణం వద్దకు వెళ్లేసరికి మరొకరితో ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతుండగా నిలదీయడంతో, నేను ఎవరితోనైనా మాట్లాడతాను, ఆ విషయం నీకు అనవసరం అని చెప్పడంతో ఆవేశానికి గురై దుకాణంలో విక్రయానికి ఉంచిన కత్తితో నరికి చంపానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు దౌలత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top