తీర్పు తర్వాత సీబీఐ రియాక్షన్
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ కేసులో ఆమె తల్లిదండ్రులను నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పడంపై సీబీఐ స్పందించింది. తీర్పునకు సంబంధించిన కోర్టు కాపీ తమకు ఇంకా అందలేదని, ఒకసారి అది అందిన తర్వాత పూర్తిగా చదివి విశ్లేషణ చేశాక ఈ కేసులో ముందుకు వెళతామని స్పష్టం చేసింది.
ఆరుషి కేసును సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టే వారిని దోషులుగా ప్రకటించింది. అయితే, ఆ తీర్పును కొట్టేస్తూ తాజాగా ఆరుషి తల్లిదండ్రులైన నుపుల్ తల్వార్, రాజేష్ తల్వార్లను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజా తీర్పుపై తల్వార్ దంపతులు ఆరుషి తాత కూడా స్పందించారు. తల్వార్ దంపతులు తమ బిడ్డ ఆరుషిని హత్య చేయలేదని తనకు ముందే తెలుసని ఆరుషి తాతయ్య అన్నారు. ఈ సందర్భంగా తాము హైకోర్టుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. ఇక తల్వార్ దంపతులు స్పందిస్తూ తమకు ఇప్పటికైనా న్యాయం జరిగిందని అన్నారు.