
ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు
తిరువనంతపురం : రెండు రోజుల క్రితం జైలు నుంచి తప్పించుకుపోయిన మహిళా ఖైదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరునవనంతపురం జిల్లా అట్టక్కులంగర మహిళల జైలు నుంచి సంధ్య(26), శిల్ప(23) అనే ఇద్దరు మహిళా ఖైదీలు మంగళవారం పారిపోయారు. సాయంత్రం జైలులో ఖైదీల సంఖ్యను లెక్కించే సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. జైలు సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి వీరు తప్పించుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా పగటిపూటే మహిళా ఖైదీలు జైలు నుంచి పరారుకావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సంఘటన వార్తలో నిలిచింది.
ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసలు.. వారి ఆచూకీ కోసం తమిళనాడులో కూడా గాలింపు చేపట్టారు. చివరకు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పాలోడ్ సమీపంలో వారిని అరెస్ట్ చేశారు. కాగా, శిల్ప చోరీ కేసులో, సంధ్య చీటింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు.