7 గంటల్లోనే దొంగ అరెస్టు

Tirupati Police Catched Thiefs In 7 Hours - Sakshi

భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

రూ.62 లక్షల విలువైన 2 కేజీల బంగారు, రూ.20 వేలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ అభిషేక్‌ మొహంతి

చిత్తూరు, తిరుపతిక్రైం: నగరంలోని చిన్నబజారువీధిలో శనివారం జరిగిన భారీ చోరీని క్రైం పోలీసులు 7 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి రూ.62 లక్షల విలువైన 2 కేజీల బంగారు నగలు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా ఎస్పీ అభిషేక్‌ మొహంతి ఆదివారం క్రైం పోలీస్‌స్టేషన్‌లో వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. చిన్నబజారువీధిలో హేమంత్‌ అనే వ్యక్తి లావణ్య జ్యువెలరీస్‌ ను నిర్వహిస్తున్నాడని తెలిపారు. దుకాణం వెనుకవైపు నివాసం ఉంటున్నాడు. ఇతని వద్ద గతంలో ఎమ్మార్‌పల్లిలో ఉంటున్న అయినపాళ్యం కళ్యాణ్‌ (23) పనిచేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతన్ని 2 ఏళ్ల క్రితం పని నుంచి నిలిపేశాడు. కళ్యాణ్‌ హైదరాబాద్‌లో ట్రావల్స్‌ను ఏర్పాటు చేసుకో వాలని భావించాడు. ఇందుకు పాత యజమాని షాపులో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు.

మాట్లాడేందుకు వెళ్లి..
ఈ నెల 5వతేదీ రాత్రి 8 గంటలకు లావణ్య జ్యువె లరీస్‌లోకి వెళ్లి 250 గ్రాముల బంగారు చెవిపోగులు కొనుగోలు చేశాడు. అనంతరం షాప్‌లో ఉన్న వారితో పాత పరిచయాన్ని వినియోగించుకుని ఇంట్లో వారితో మాట్లాడి మరుగుదొడ్డి కోసమని ఇంటి వెనక్కు వెళ్లాడు. అక్కడ తలుపునకు ఉన్న టవర్‌ బోల్ట్, ఇనుప గ్రిల్‌గేట్‌ను తీసివేసి బయటకు వచ్చేశాడు. రాత్రి ఒంటి గంట సమయంలో లావణ్య జ్యువెలర్స్‌లోకి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి బంగారు చైను, డబ్బులు, క్యాష్‌ బ్యాగులోని రూ.20 వేలు, సీసీ కెమెరాల డీవీఆర్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. డీవీఆర్‌ను పాడుబడిన బావిలో పడేశాడు. ఇంతలో చోరీ జరిగినట్లు యజమాని గుర్తించి క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ముందురోజు, వెనుక రోజు ఎవరెవరు వచ్చారనే విషయాలను తెలుసుకున్నారు. కళ్యాణ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్టు అంగీకరించాడు. అతని నుంచి రూ.62 లక్షల విలువైన 2 కేజీల 55 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు నగదు దొంగతనానికి వినియోగించిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వింగ్స్‌ యాప్‌తో ఉద్యోగుల సమాచారం సేకరిస్తాం
ఇకపై నగరంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా బంగారు షాపులు, షోరూంలు, ప్రముఖ షాపుల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలను వింగ్స్‌ యాప్‌ ద్వారా త్వరలోనే సేకరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తి ఆధార్‌కార్డు, ఫొటో వివరాలను సేకరించవచ్చన్నారు. వాటిని బట్టి చిరునామా కనుక్కోవడం, అతని నేర చరిత్రను ఆరాతీయడం సులభమవుతుందని చెప్పారు. అంతేగాక వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారిలో నేర చరితులు, దొంగతనాలు చేసి ఉంటే వెంటనే గుర్తించవచ్చన్నారు. 10 రోజుల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలు ఎక్కడైనా వెళ్లే సమయంలో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ నుంచి లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను వినియోగించుకోవచ్చన్నారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐలు భాస్కర్‌రెడ్డి, శరత్‌చంద్ర, అబ్బన్న, మధు, పద్మలత, రసూలు సాహెబ్, ఇతర సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top