భార్యభర్తలను కట్టేసి.. చోరికి తెగబడ్డారు | Sakshi
Sakshi News home page

భార్యభర్తలను కట్టేసి.. చోరికి తెగబడ్డారు

Published Sun, Feb 2 2020 8:24 AM

Thief Made Robbery In Vellore Tamil Nadu - Sakshi

వేలూరు : ఒడుగత్తూరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి భార్య, భర్తలను కట్టి పెట్టి నగలు, నగదు చోరీ చేసిన సంఘటన సంచలనం రేపింది. వేలూరు జిల్లా ఒడుగత్తూరు సమీపంలోని ఓట్టేరిపాళ్యం గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌ మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  ఇతని భార్య కళ. శ్రీనివాసన్‌ శుక్రవారం ఏడు మేకలను రూ. 70 వేలకు విక్రయించి ఇంటికి వచ్చాడు. రాత్రి భార్య, భర్తలిద్దరూ నిద్రించారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో మొకానికి మంకీ క్యాప్‌ ధరించిన ఆరుగురు శ్రీనివాసన్‌ ఇంటికి చేరుకుని ఇంటి ముందు తలుపులకు తాళం వేసి వెనుక వైపున ఉన్న దారిలో ఇంటిలోనికి చొరబడ్డారు.

శబ్దం విన్న శ్రీనివాసన్‌ లేచి చూడగా ఆరుగురు మంకీ క్యాప్‌ ధరించి ఉండటంతో కేకలు వేసేందుకు ప్రయత్నించాడు. ముఠా సభ్యులు శ్రీనివాసన్‌పై దాడి చేశారు. వీటిని అడ్డుకునేందుకు భార్య కళ ప్రయత్నించడంతో ఆమెపై దాడి చేసి ఇంటిలోనే కట్టి పెట్టారు. అనంతరం కళ ధరించిన తాళిబొట్టు, కమ్మలు, మరో చైన్‌తో పాటు మేకలు విక్రయించగా వచ్చిన రూ. 70 వేలతో పరారయ్యారు. శనివారం ఉదయం శ్రీనివాసన్‌ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు ఇంటిలోకి వెళ్లి చూశారు. భార్య, భర్తలు ఇద్దరూ స్పృహ తప్పి పడి ఉండడాన్ని గమనించారు. వారిని వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేపాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు.  

Advertisement
Advertisement