సంచలనం : ఢిల్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు

Six Months Prison to Delhi Assembly Speaker - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌, అతని కుమారుడు సుమిత్‌ గోయెల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించింది. వివరాలు.. 2015 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాదర నియోజకవర్గంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున రామ్‌ నివాస్‌ గోయెల్‌ పోటీ చేశారు. ప్రత్యర్థి తరపున ఓటర్లకు మద్యం, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో వివేక్‌ విహార్‌లోని మనీశ్‌ ఘాయి అనే స్థానిక బిల్డర్‌ ఇంట్లోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా చొరబడి తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో ఇంట్లోని పర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డొచ్చిన పని మనుషులపై దాడి చేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రామ్‌ నివాస్‌పై సెక్షన్‌ 448 కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం 2017 సెప్టెంబర్‌లో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేటు ఏడుగురిని దోషులుగా తేల్చింది. తాజాగా ఇప్పుడు శిక్ష ఖరారైంది. అయితే సెక్షన్‌ 448 ప్రకారం గరిష్టంగా ఏడాది మాత్రమే శిక్ష విధించాలి. దీంతో రాజ్యాంగబద్ధంగా స్పీకర్‌ అనర్హత వేటుకి గురికారు. అయితే, గతంలో ఈ ఆరోపణలను రామ్‌ నివాస్‌ గోయెల్‌ ఖండించారు. ఘటనకు ముందు ప్రైవేట్‌ ఫిర్యాదునిచ్చి పోలీసుల సహాయంతోనే మనీశ్‌ ఘాయి ఇంటికి వెళ్లామనడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top