అనంతలో ఉన్మాది ఘాతుకం | Phsyco Attempt To Murder On Woman Anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో ఉన్మాది ఘాతుకం

Aug 24 2018 11:09 AM | Updated on Aug 24 2018 11:09 AM

Phsyco Attempt To Murder On Woman Anantapur - Sakshi

చికిత్స పొందుతున్న బాధితురాలు యాస్మిన్‌ , నిందితుడు శ్రీనివాసులు

వెంట తెచ్చుకున్న సూపర్‌వాస్మోల్‌ తాగాడు. ఆపై తన మణికట్టు వద్ద బ్లేడుతో కోసుకున్నాడు

అనంతపురం సెంట్రల్‌: అనంతలో ఉన్మాది రెచ్చిపోయాడు. తొలుత తనకు దగ్గరగా ఉన్న మహిళ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో దూరంగా ఉన్నందుకు ఆమె గొంతుకోసి... తనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నగర శివారులోని ఆదర్శనగర్‌లో చోటు చేసుకుంది. రూరల్‌ పోలీసుల కథనం మేరకు... ఆదర్శనగర్‌లో నివాసముంటున్న రామాంజనేయులు, యాస్మిన్‌(21) దంపతులకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కొన్నేళ్ల క్రితం రామాంజనేయులుకు వరుసకు తమ్ముడయ్యే శ్రీనివాసులు(అశోక్‌నగర్‌) అనే వ్యక్తితో యాస్మిన్‌ చనువుగా ఉండేది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో వారు కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. అయితే శ్రీనివాసులు కొంతకాలంగా గతం గుర్తు చేస్తూ యాస్మిన్‌ను వేధించడం మొదలెట్టాడు. ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోకపోగా ఉన్మాదిగా తయారయ్యాడు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం బాధితురాలి ఇంటి వద్దకు ఆటోలో వెళ్లి మాట్లాడే పనుందని నమ్మబలికాడు. ఆమెను రూరల్‌ మండలం కాట్నేకాలువ చెరువుగట్టుపైకి తీసుకెళ్లాడు. తిరిగి తనకు దగ్గర కావాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిపోయి వెంట తెచ్చుకున్న సూపర్‌వాస్మోల్‌ తాగాడు. ఆపై తన మణికట్టు వద్ద బ్లేడుతో కోసుకున్నాడు. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. బంధువులు హుటాహుటిన వచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీనివాసులును వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. బాధితురాలు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితునిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు రూరల్‌ సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement