ఓయూలో పరిశోధక విద్యార్థి మృతి | Osmania University Research Student Died Hyderabad | Sakshi
Sakshi News home page

ఓయూలో పరిశోధక విద్యార్థి మృతి

Feb 18 2020 9:39 AM | Updated on Feb 18 2020 9:39 AM

Osmania University Research Student Died Hyderabad - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీలో పరిశోధక విద్యార్థి కొంపల్లి నర్సింహ (45) మృతి చెందారు. ఓయూ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన కొంపల్లి నర్సింహ క్యాంపస్‌లోని సైన్స్‌ కాలేజీ జాగ్రఫీ విభాగంలో ఇటీవల పీహెచ్‌డీ పూర్తి చేశారు. న్యూ పీజీ హాస్టల్‌లోని రూం నంబర్‌ 3లో ఉంటున్న అతడు ఆదివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. గది లోపల గడియ వేసుకొని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. నర్సింహ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మృతుడి అంత్యక్రియల కోసం తక్షణ సహాయంగా రూ.25 వేలను అందచేసినట్లు ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు.  

ఉద్యోగం రాలేదనే మానసిక క్షోభతో..  
ఓయూలో పీహెచ్‌డీ పూర్తి చేసి పీడీఎఫ్‌ కోసం చదువుతున్న నర్సింహ ఉద్యోగం రాలేదని, 45 ఏళ్లు వచ్చినా జీవితంలో స్థిరపడలేదని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నర్సింహ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం న్యూ పీజీ హాస్టల్‌ ఎదుట మృతదేహంతో  ఆందోళనకు దిగారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావు, తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్‌ ఛైర్మన్‌ చనగాని దయాకర్‌గౌడ్, విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు.  

మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి..  
ఓయూ పరిశోధన విద్యార్థి నర్సింహమృతిపట్ల ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement