స్కార్పియోను ఢీకొన్న లారీ: 10 మంది మృతి | Nine Dead In Road Accident In Chhattisgarh | Sakshi
Sakshi News home page

Oct 14 2018 10:11 PM | Updated on Oct 15 2018 4:53 AM

Nine Dead In Road Accident In Chhattisgarh - Sakshi

వెలిగండ్ల: ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్‌ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం స్కార్పియో, లారీ ఢీకొనడంతో 10 మంది దుర్మరణం చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందినవారిలో 9 మంది ప్రకాశం జిల్లాకు చెందినవారు. వారు డోంగర్‌గఢ్‌ సమీపంలోని మా బమలేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించుకుని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భిలాయ్‌లోని క్యాంప్‌–1లో నివాసముంటున్న 13 మంది శనివారం డోంగర్‌గఢ్‌లోని మా బమలేశ్వరీ దేవి ఆలయానికి స్కార్పియో వాహనంలో వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఉదయం 7 గంటల సమయంలో సోమ్ని గ్రామం సమీపంలో రాజనందగావ్‌– దుర్గ్‌ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పాపాయిపల్లికి చెందిన శెట్టి మంజు (18), శెట్టి వెంకటలక్ష్మీ (27), హనుమంతునిపాడు మండలం మంగంపల్లికి చెందిన పాపాబత్తుని పెద్ద మంగయ్య (30), ఆయన భార్య పాపాబత్తుని వెంకటలక్ష్మి(25), పాపాబత్తుని మనీషా(15), సీఎస్‌పురం మండలం వెంగనగుంట గ్రామానికి చెందిన కుడారి ఆదినారాయణ(32), ఆయన భార్య సావిత్రి (28), మర్రిపూడి మండలం గార్లపేటకు చెందిన అండ్ర విజయ్‌కుమార్‌(32), ఆయన భార్య నాగమణి (25) అక్కడికక్కడే మృతి చెందారు. శెట్టి వెంకటలక్ష్మి భర్త శెట్టి వెంకటేశ్వర్లు, శెట్టి బాబు, మంగంపల్లికి చెందిన పాపాబత్తుని మహేంద్రలు తీవ్రంగా గాయపడ్డారు. కుడారి ఆదినారాయణ, భార్య సావిత్రిల ఏకైక కుమారుడు నితీష్‌(5) ప్రాణాలతో బయటపడ్డాడు.  

Advertisement
 
Advertisement
Advertisement