మీ టూ సుడిలో స్వామీజీ | Sakshi
Sakshi News home page

మీ టూ సుడిలో స్వామీజీ

Published Thu, Nov 22 2018 12:34 PM

Metoo Complaint Against Karnataka Swamyji - Sakshi

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: సినీ రంగాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల ‘మీటూ’ విస్తరిస్తోంది...తాజాగా బుధవారంనాడు ఒక మహిళ... స్వామీజీ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదంటూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో కాస్త మీడియా దృష్టికి వెళ్లడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా వనకల్లు మఠం బసవ రమానంద స్వామీజీ పై ఆ మహిళ ఈ ఆరోపణలు చేసింది. ఆమె వీడియోలో మాట్లాడుతూ..  స్వామీజీ పని ఇప్పిస్తానని చెప్పి ఒంటరిగా మఠానికి పిలిపించి అత్యాచారం చేశాడని పేర్కొంది. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని, నీ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ సంఘటన జరిగాక 7 నెలల క్రితం డాబస్‌పేట పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, స్వామీజీపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరపకుండా డాబస్‌పేట ఎస్సై శంకర్‌ నాయక్‌ బీ–రిపోర్టు వేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించింది.

కక్షతో చేయిస్తున్నారు: రమానందస్వామీజీ  
రమానంద స్వామీజీ స్పందిస్తూ, ఇవన్నీ తనపై కక్షతో మధుమయానంద స్వామీజీ ఆ మహిళతో నాటకం ఆడిస్తున్నాడని, ఆమెతో పరిచయమే లేదని, ఎటువంటి వైద్య పరీక్షలకయినా తాను సిద్ధమని ప్రకటించారు. ఒకవేళ ఈ ఆరోపణ రుజువయితే మఠాన్ని వదిలి ప్రాణత్యాగం చేసుకుంటానని సవాలు చేశారు. ఆ మహిళతో తనకు కూడా పరిచయంలేదని, పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసి ఆమెకు మద్దతుగా మాత్రమే నిలిచానని మధుమయానందస్వామి చెబుతున్నారు. ఒక మహిళ, ఇద్దరు స్వామీజీల మధ్య గొడవ ఎక్కడికి వెళ్తుందోనని వనకల్లు మల్లేశ్వర మఠం భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

Advertisement
Advertisement