త‌న‌ మేక‌ను కుక్క క‌రిచింద‌ని, 40 కుక్క‌ల‌ను.. | Man Poisons 40 Dogs to Take Revenge Of Dog Bitten His Goat In Odisha | Sakshi
Sakshi News home page

ప్ర‌తీకారం: 40 కుక్క‌ల‌కు విషం ఇచ్చి చంపాడు

Jun 26 2020 3:50 PM | Updated on Jun 26 2020 3:58 PM

Man Poisons 40 Dogs to Take Revenge Of Dog Bitten His Goat In Odisha - Sakshi

భువ‌నేశ్వ‌ర్ : ఓ వీధి కుక్క త‌న మేక‌ను క‌రిచింద‌ని కుక్క‌లన్నింటిపైనా కక్ష క‌ట్టాడో వ్య‌క్తి. ఊర్లో ఉన్న అన్ని కుక్క‌ల‌కు విషం ఇచ్చి వాటిని పొట్ట‌న పెట్టుకున్నాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఒడిశాలోని చౌదార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌ట‌క్ జిల్లాలోని మ‌హంగలో బ్ర‌హ్మానంద మాలిక్ అనే వ్య‌క్తి పెంచుకుంటున్న మేక‌ను ఓ రోజు వీధి కుక్క క‌రిచింది. దానికి గాయ‌మ‌వ‌డంతో అత‌డు కుక్క జాతిపైనే ప‌గ ప‌ట్టాడు. ఊరిలోని కుక్క‌ల‌న్నింటి ప్రాణాలు తీసేందుకు కుట్ర ప‌న్నాడు. దీనికి భ‌ర‌త్ మాలిక్ అనే వ్య‌క్తి సాయం తీసుకున్నాడు. అత‌నితో క‌లిసి కుక్క‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన మాంసం తీసుకొచ్చి వాటిలో విష‌పు గుళిక‌లు క‌లిపాడు. (మంచాన ప‌డ్డ త‌ల్లిని బ్యాంకుకు లాక్కెళ్తూ..)

అనంత‌రం ఆ విష‌పు ఆహారాన్ని శున‌కాల‌కు ఎర‌గా వేశాడు. దీంతో దాన్ని తిన్న 40 కుక్క‌లు రోడ్డుపై విల‌విల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. ఈ ఘ‌ట‌న‌పై గ్రామ‌స్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "క‌ళ్ల‌ముందే కుక్క‌లు బాధ‌తో గిల‌గిలా కొట్టుకుంటూ చ‌చ్చిపోవ‌డం చూడ‌లేక‌పోయాం. ఇది మా హృద‌యాల‌ను క‌లిచి వేసింది" అని ఓ గ్రామ‌స్థుడు తెలిపాడు. ఈ విష‌యం గురించి ఆ ఊరి స‌ర్పంచ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు స‌మోదు చేశారు. ప‌రారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు. ఇక ఈ ఘ‌ట‌న స‌రిగ్గా ఏ రోజు జ‌రిగిందనేది తెలియ‌రాలేదు. (పోలీసునంటాడు.. సెల్‌ఫోన్లతో ఉడాయిస్తాడు)

Advertisement
 
Advertisement
Advertisement