రైలు టాయిలెట్‌లో యువకుడు దారుణ హత్య? | Man Murdered in Train Toilet Tamil Nadu | Sakshi
Sakshi News home page

రైలు టాయిలెట్‌లో యువకుడు దారుణ హత్య?

May 1 2019 8:50 AM | Updated on May 1 2019 8:50 AM

Man Murdered in Train Toilet Tamil Nadu - Sakshi

రైలు బోగీ టాయిలెట్‌లో రక్తం మరకలు

నడుస్తున్న రైలు నుంచి మృతదేహం తోసివేసినట్లుగా అనుమానం

సాక్షి ప్రతినిధి, చెన్నై: కదులుతున్న రైలు బోగీలోని టాయిలెట్‌ను అగంతకులు అనువుగా ఎంచుకున్నారు. టాయిలెట్‌లోకి యువకుడిని లాక్కుని వెళ్లి కత్తులతో నరికి దారుణంగా హతమార్చి శవాన్ని బయటకు విసిరివేసిన కిరాతక సంఘటన తమిళనాడులో చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  వివరాలు. ఉద్యోగులు, పాఠశాల, కాలేజీ విద్యార్థుల సౌకర్యం కోసం తూత్తుకూడి– తిరుచెందూరు మధ్య ప్యాసింజర్‌ రైలును నడుపుతున్నారు.

సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ రైలు తిరుచెందూరుకు చేరుకోగా ప్రయాణికులంతా దిగిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు అధికారులు యథావిధిగా బోగీలన్నింటినీ తనిఖీ చేశారు. ఇంజిన్‌ నుంచి ఐదో బోగీ టాయిలెట్‌ తలుపు తెరిచిచూడగా రక్తం మడుగులు కట్టి ఎండిపోయిన స్థితిలో ఉండడాన్ని గమనించి గగుర్పాటుకు గురయ్యారు. హత్య జరిగిన తీరును బట్టి ఒకరి కంటే ఎక్కువ మంది దుండగులు యువకుడిని హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మధ్యాహ్నం వేళ ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండడం, ప్రయాణ సమయంలో తలుపేసిన టాయిలెట్‌ నుంచి శబ్దం వచ్చే అవకాశం లేకపోవడం వల్ల హతుడిని టాయిలెట్‌లోకి లాక్కుని వెళ్లి నరికి హత్య చేసినట్లు భావిస్తున్నారు. మృతదేహం లేకపోవడంతో పరుగులు తీస్తున్న రైలు నుంచి గిరాటు వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement