మోటారు సైకిల్‌ అదుపుతప్పి.. యువకుడి దుర్మరణం

Man Died in Bike Accident Kurnool - Sakshi

మరొకరి పరిస్థితి విషమం

కర్నూలు  , చిప్పగిరి:  మోటారు సైకిల్‌ అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఏరూరు– చిప్పగిరి మార్గమధ్యంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఏరూరు గ్రామానికి చెందిన బోయ గోవిందు, ఎర్రమ్మ దంపతులకు కుమారుడు రమేష్‌ (22), ఒక కుమార్తె ఉన్నారు. రమేష్‌ స్థానికంగానూ.. ఏరూరు, గుంతకల్లు, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం రాత్రి  తన స్నేహితుడు సురేష్‌రెడ్డితో కలిసి ఏరూరు నుంచి చిప్పగిరికి సొంత పనిమీద మోటారుసైకిల్‌పై బయలుదేరారు.

గ్రామం దాటిన తర్వాత సిద్ధబసవన్న కుంట (మఠం) వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అతి వేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్‌ మృతి చెందాడు. సురేష్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top