
సాక్షి, పెద్దపల్లి/మంథని : పెద్దపల్లి జిల్లాలో మరో నేరెళ్ల ఘటన పునరావృతమైంది. ఇసుక లారీ మరో ప్రాణం బలిగొనడంతో రగిలిపోయిన గ్రామస్థులు తిరగబడ్డారు. దాదాపు 200 ఇసుక లారీలపై దాడికి దిగారు. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై దాదాపు ఐదుగంటల పాటు జరిగిన ఆందోళనతో 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. వివరాలిలా ఉన్నాయి..పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ ఎస్సీ కాలనీ సమీపంలో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆదివారంపేట ఉపసర్పంచ్ ఎరువాక రాజయ్య మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లడంతో, కొద్దిదూరంలో పట్టుకున్న స్థానికులు ఆ లారీ అద్దాలు, లైట్లను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో వెనుక ఆగి ఉన్న సుమారు 200 లారీల అద్దాలు, లైట్లను కూడా ధ్వంసం చేశారు. మృతదేహంతో బైఠాయించి ఐదు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు.
రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి..
రాజాపూర్కు చెందిన రాజయ్య(65 ) గ్రామ ఉప సర్పంచ్. మరో వ్యక్తితో కలసి ద్విచక్ర వాహనంపై బేగంపేట వైపు పొలం వద్దకు బయలు దేరాడు. అదే సమయంలో మంథని నుంచి వస్తున్న ఇసుక లారీ వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో రాజయ్య తలకు బలమైన గాయౖ మె అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన వెంట ఉన్న మరో వ్యక్తికి గాయాలు కాగా ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. లారీలను నియంత్రించాలని, మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లిం చాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.