
బెంగళూరు : క్యాష్ స్కాండల్లో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుంటోంది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల ఆస్తులపై దాడులు చేసిన ఆదాయపు పన్నుశాఖ తాజాగా కర్ణాటక మంత్రి డీకే శివకుమార్పై ఫిర్యాదు చేసింది. ఆర్థిక పరమైన కేసుల్లో శివకుమార్కు సంబంధం ఉందని బెంగళూరు ప్రత్యేక కోర్టుకు ఐటీశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. హవాలా (నగదు మార్పిడి) రాకెట్ కేసులో శివకుమార్కు హస్తం ఉందని గతంలోనూ ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఐటీశాఖ మరో అడుగు ముందుకేసి శివకుమార్పై నమోదైన కేసులు, ఆరోపణలను స్పెషల్ కోర్టుకు వివరించింది. గతంలోనూ పన్ను ఎగ్గొట్టిన కేసుల్లో ఐటీశాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
కాగా, గతేడాది ఆగస్టులో శివకుమార్ ఇళ్లు, ఆస్తులపై ఐటీశాఖ ఆకస్మిక దాడులు చేసింది. మంత్రి ఇంటి నుంచి రూ. 20 కోట్ల నగధును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏఐసీసీకి ఆ పార్టీ నేత శివకుమార్ మొత్తం 5 కోట్ల రూపాయాలు సమర్పించినట్లు ఆరోపణలున్నాయ. 2017 జనవరి 1న ఏఐసీసీకి రూ.3 కోట్లు, అదే జనవరి 9న మరో 2 కోట్ల రూపాయలు డీకే చెల్లించినట్లు ఐటీశాఖ పేర్కొంది. క్యాష్ స్కాండల్ (నగదు కుంభకోణం) కాంగ్రెస్ పార్టీని బోనులో నిలబెట్టేలా కనిపిస్తోంది. కాగా శివకుమార్పై నమోదైన కేసులపై ఐటీశాఖ తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.