అంతం చూసిన వివాహేతర సంబంధం

Illegal Affair Man Murder In Khammam - Sakshi

ప్రియురాలి ఇంట్లోనే సంఘటన

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన దంపతులు

బోనకల్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని మోటమర్రి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ వేణు మాధవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చిట్టుమోదు విష్ణు భార్యతో అదే గ్రామవాసి మరీదు ఉపేంద్ర(40) గత కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం విష్ణు పోలీస్‌ స్టేషన్‌లో తన భార్యను వేధిస్తున్నాడని ఉపేంద్రపై ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తాను బుద్ధిగా ఉంటానని చెప్పాడు.

కానీ..యథావిధిగా అతను ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం విష్ణు, ఉపేంద్ర వారి పొలాల వద్దకు వెళ్లారు. విష్ణు పొలంలో ఉండడాన్ని గమనించిన ఉపేంద్ర ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన విష్ణు ఇంటికి రాగా..అప్పటికే తన ఇంట్లో భార్యతో ఉపేంద్ర ఉండడాన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. కల్లు గీత కత్తితో ఉపేంద్ర మెడ, కణితిపై విష్ణు దాడి చేశాడు.

ఈ సంఘటనలో అక్కడిక్కడే అతను మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. హత్య చేసిన తర్వాత ఇంటికి తాళం వేసి పోలీస్‌ స్టేషన్‌కు విష్ణు తన భార్యతో కలిసి వెళ్లి లొంగిపోయాడు. సీఐ వేణు మాధవ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top