పదిమంది గుట్కా వ్యాపారుల అరెస్టు | Sakshi
Sakshi News home page

పదిమంది గుట్కా వ్యాపారుల అరెస్టు

Published Wed, Jun 13 2018 1:00 PM

Gutka Gang Arrest In Krishna - Sakshi

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : విజయవాడ ప్రాంతాన్ని గుట్కా రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఇన్‌చార్జి అడిషనల్‌ డీసీపీ షేక్‌ నవాబ్‌ జాన్‌ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధించిన గుట్కా, ఖైనీ, పాన్‌ మసాలా ప్యాకెట్లను నగరంలో విక్రయిస్తున్న 10 మంది వ్యాపారులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా న్యూఆర్‌ఆర్‌పేటలోని సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నవాబ్‌ ఖాన్‌ వివరాలను వెల్లడించారు. గతంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేసిన దాడులతోపాటుగా చేపట్టిన నిఘా చర్యల్లో భాగంగా పది మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కొందరు వ్యాపారులు ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గుట్కా రహిత నగరాన్ని నిర్మించడమే తమ ధ్యేయమని చెప్పారు. నిషేధిత గుట్కా, ఖైనీ వంటి వాటిని విక్రయించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో నార్త్‌ జోన్‌ ఏసీపీ శ్రావణి, సింగ్‌నగర్‌ స్టేషన్‌ సీఐ ఎంవీవీ జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement