క్లాస్‌రూమ్‌లోనే నాలుగు రోజుల నరకం.. | Sakshi
Sakshi News home page

క్లాస్‌రూమ్‌లోనే నాలుగు రోజుల నరకం..

Published Sun, Apr 22 2018 7:16 PM

Girl Students Abused In Class Room In West Bengals Raiganj - Sakshi

కోల్‌కతా: కథువా ఉదంతంతో దేశ వ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే తరగతి గదిలో కీచకపర్వం కొనసాగించాడు. ఇద్దరు విద్యార్థినులపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. దినాజ్‌పూర్ జిల్లా రాయ్‌గంజ్‌లోని పాఠశాలకు చెందిన నాల్గో తరగతి విద్యార్థిని స్కూలు పేరు చెబితే భయపడుతోంది. వెళ్లనని మొండికేస్తోంది. దీంతో తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుని ఏమైందని అడగగా.. తమ టీచర్ చేసే ఆకృత్యాలను బాలిక చెప్పింది. మరో బాలికను కూడా సార్ ఇలాగే చేశాడని చెప్పగా.. ఆ చిన్నారి ఇంటికి వెళ్లి అసలు విషయం చెప్పారు. దీంతో ఆవేశానికి లోనైన బాలికల తండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తరగతి గదిలో లైంగిక దాడులు చేస్తున్న టీచర్‌ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. 

విద్యార్థులందరూ వెళ్లిపోయాక క్లాస్‌రూమ్‌లో తమపై అత్యాచారం చేసేవాడని, ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధిత బాలికలు చెప్పారు. నాలుగు రోజులపాటు తమ కూతుళ్లపై కీచకపర్వం కొనసాగించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement