సెప్టిక్‌ ట్యాంక్‌లో ట్రాక్టర్‌ బోల్తా ; కార్మికుడి మృతి

GHMC Sanitation Worker Died In Septic Tank Hafeezpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హఫీజ్‌పేట్‌ డివిజన్‌లోని జనప్రియనగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌లో ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో.. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుడు ప్రాణాలు కొల్పోయాడు. మృతున్ని వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. శుక్రవారం జనప్రియ కాలనీలో ఉన్న సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేయడంతో పాటు, పక్కనే ఉన్న మురికి కాలువలోని  మట్టిని తొలగించడానికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ట్రాక్టర్‌ అదుపు తప్పి సెప్టిక్‌ ట్యాంక్‌పైకి రావడంతో ఒక్కసారిగా ట్యాంక్‌పైనున్న సిమెంట్‌ బిల్లలు పగిలిపోయాయి. దీంతో ట్రాక్టర్‌ అందులో పడిపోయింది.  ట్రాక్టర్‌లో ఉన్న వెంకటేశ్‌ సెప్టిక్‌ ట్యాంక్‌లో పడి గల్లంతయ్యాడు. ఆ కాలనీ మొత్తానికి అదొక్కటే సెప్టిక్‌ ట్యాంక్‌ కావడం, 10మీటర్లకు పైగా లోతు ఉండటంతో వెంకటేశ్‌ ఆచూకీని గుర్తించడం కష్టంగా మారింది. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ట్యాంక్‌లోని నీటిని మోటర్‌ పంపుల ద్వారా బయటకు పంపించారు. మూడు గంటలపైగా శ్రమించిన అధికారులు వెంకటేశ్‌ మృతదేహాన్నిబయటకు తీసి బంధువులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top