నకిలీ పోలీస్‌ ఆటకట్టు

Fake Police Arrest in Hyderabad - Sakshi

నాగోలు: ఒంటరిగా వెళుతున్న వృద్ధులను టార్గెట్‌ చేసుకుని పోలీసునని బెదిరించి బంగారం, నగదు దోచుకుంటున్న వ్యక్తిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి 10 తులాల బంగారు నగలు, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా, దిండి మండలం, టి.గౌరారం గ్రామానికి చెందిన రమావత్‌ నరేష్‌ నగరానికి వలస వచ్చి రామాంతపూర్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను గతంలో పలు దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు గాను పోలీస్‌ అవతారం ఎత్తిన అతను ఒంటరిగా వెళుతున్న వృద్దులను లక్ష్యంగా చేసుకుని బైక్‌పై వారిని వెంబడించి పోలీసునని బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు లాక్కునేవాడు. ఇదే తరహాలో ఎల్‌బీనగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఐదు, కాచిగూడ పరిధిలో ఒక దోపిడీకి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎల్‌బీనగర్‌ పోలీసులు  శుక్రవారం అతడిని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.3.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీధర్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి,డీఐ కృష్ణ మోహన్, క్రైమ్‌ ఎస్‌ఐ మారయ్య పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top