ఆధార్‌, పార్సిల్‌ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం | Digital Arrest Scam Bengaluru Techie Sells Her Flat, 2 Plots To Pay Rs 2 Crore | Sakshi
Sakshi News home page

ఆధార్‌, పార్సిల్‌ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం

Dec 16 2025 4:23 PM | Updated on Dec 16 2025 4:37 PM

ప్రతీకాత్మక చిత్రం

డిజిటల్‌ అరెస్ట్‌ మోసానికి బలవుతున్న బాధితులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  నకిలీ అధికారుల వలలో పడి బాధితులు కోట్ల రూపాయలను  నష్టపోతున్నారు. బాధితుల్లో విద్యాధికులే ఎ క్కువగా ఉండటం మరింత విచారకరం. తాజగా  బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి 2 కోట్ల విలువైన ఆస్తులను  అమ్ముకున్న వైనం ఆందోళన  రేపుతోంది.  

బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ నిపుణురాలు  బబితా దాస్ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో  రూ. 2 కోట్లు నష్టపోయింది. నకిలీ పోలీసుల డిమాండ్లను  నెరవేర్చేందుకు  తను ఉంటున్న ఇంటినీ, మరో రెండు ప్లాట్లను తెగనమ్ముకుంది. బాధితురాలు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ, తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి విజ్ఞాన్ నగర్‌లోని  ఫ్లాట్‌లో నివసిస్తోంది బబితా. జూన్‌లో, కొరియర్ అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక అనుమానాస్పద లగేజీని తాము స్వాధీనం చేసుకున్నట్లు  నమ్మించాడు.

ఆ కాల్‌ను తక్షణమే ముంబై పోలీసు అధికారులుగా చెప్పుకుంటున్న మరో కేటుగాళ్లకు బదిలీ చేశాడు. అరెస్టు చేస్తామని బెదిరించి, ధృవీకరణ పూర్తయ్యేవరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మోసగాళ్లు ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయాలని బెదిరించారు. తమకు సహకరించి అలా చేయకపోతే,  కొడుకువిషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తాము చెప్పినట్టుగా చెల్లింపులు చేసి, ఆ తరువాత పోలీసుల  ద్వారా తిరిగి పొందవచ్చని నమ్మబలికారు.

చదవండి: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్నభారత సంతతి మహిళ అరెస్ట్

దీంతో బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిపోయిన ఆమె వాళ్లు చెప్పినట్టే  చేసింది.  తక్కువ ధరకే మలూరు లోని రెండు ప్లాట్లను , ఇటు తాను ఉంటున్న విజ్ఞాన్ నగర్ ఫ్లాట్‌ను కూడా అమ్మేసింది. తద్వారా వచ్చిన సొమ్మును ను మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పాటు ఆమె బ్యాంకు నుండి రుణం కూడా తీసుకుని  సుమారు రూ. 2 కోట్లు  మోసగాళ్లకు చెల్లించింది. ఆ తరువాత మోసగాళ్లు తరువాత డబ్బును తిరిగి పొందడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పి, అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు. ఆ తర్వాత యథావిధిగానే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్  అయ్యాయి. దీంతో  మోసపోయానని గ్రహించిన ఆమె వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి?

Advertisement
 
Advertisement
Advertisement