జగ్గారెడ్డి 15 లక్షలు తీసుకున్నారు: డీసీపీ సుమతి

DCP Sumathi Says Jagga Reddy Takes Lakhs - Sakshi

సాక్షి, హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పక్కా ఆధారాలతోనే అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ సుమతి తెలిపారు. ఆయన ముగ్గుర్ని కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా అమెరికాకు పంపారని, దీనికి వారి నుంచి రూ. 15 లక్షలు తీసుకున్నారని తెలిపారు. మంగళవారం ఆమె మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జగ్గారెడ్డిని అరెస్ట్‌ చేశారన్న ఆరోపణలను  ఖండించారు. (చదవండి: అక్రమంగా అరెస్ట్‌ చేశారు: జగ్గారెడ్డి)

సికింద్రాబాద్‌ మార్కెట్‌ పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదుతో నిశితంగా దర్యాప్తు చేశామన్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి  కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్ట్‌లు పొందారని, ఎమ్మెల్యే లెటర్‌ హెడ్‌తో పాస్‌పోర్టులు ఇవ్వాలని కోరారన్నారు. ఈ నకిలీ పాస్‌పోర్ట్‌లతో వీసాలు పొందారని, భార్య ఫొటో, కుమార్తె, కుమారుడు పుట్టిన తేదీల మార్పిడి జరిగిందన్నారు. ఆధార్‌ డేటా ఆధారంగా ఈ అక్రమాలను గుర్తించినట్లు స్పష్టం చేశారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమెరికాకు పంపించిన వ్యక్తులను బ్రోకర్‌ మధు తన దగ్గరకు తీసుకొచ్చాడని ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు తమ విచారణలో జగ్గారెడ్డి చెప్పారన్నారు. ఐపీసీ 419,490,467,468,471,370 సెక్షన్లతో పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 12,  ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌ 24 కింద కేసులు నమోదు చేశామన్నారు, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

చదవండి: జగ్గారెడ్డి అరెస్ట్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top