స్మగుల్డ్‌ సిగరెట్ల విక్రయానికి చెక్‌!

Cigarette Smuggling Gang Held in Hyerabad - Sakshi

విదేశాల్లో తయారవుతున్న అనేక బ్రాండ్లు

కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు రవాణా

వీటితో ప్రజారోగ్యానికీ చేటు అనే అనుమానాలు

గుట్టు రట్టు చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌  

సాక్షి, సిటీబ్యూరో: బంగారం.. ఎలక్ట్రానిక్‌ వస్తువులు.. మాదకద్రవ్యాలు.. ఇవి మాత్రమే కాదు సిగరెట్లు సైతం పెద్ద ఎత్తున సిటీకి అక్రమ రవాణా అవుతున్నాయి. ఇలా జరుగుతున్న స్మగ్లింగ్‌ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి చేటని అధికారులు చెబుతున్నారు. నగరానికి అక్రమంగా వచ్చి చేరిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తితో పాటు అతడికి సరఫరా చేస్తున్న నిందితుడినీ మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.90 వేల విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతోందని మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు.

కోల్‌కతా మీదుగా..
హైదరాబాద్‌ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో 23 బ్రాండ్లకు చెందినవి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్‌ కలిగి ఉండే బ్లాక్, గరమ్‌లతో పాటు ప్యారిస్, విన్, ఎస్సీ, మోండ్, మల్‌బొరొ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు చెబుతున్నారు. ఇవి తయారవుతోంది చైనా, బంగ్లాదేశ్‌ల్లో అయినప్పటికీ అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. కోల్‌కతా మీదుగానే సిటీకి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కస్టమ్స్‌ సహా వివిధ విభాగాల కళ్లుగప్పేందుకు అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువులంటూ జరుగుతోందని వివరిస్తున్నారు. ఇలా నగరానికి వచ్చిన సిగరెట్లను గోషామహల్‌కు చెందిన మిలన్‌కుమార్‌ జైన్‌ అనే వ్యక్తి తన వద్ద స్టాక్‌ చేసుకుని హోల్‌సేల్‌గా రిటైలర్లకు విక్రయిస్తున్నాడు. యూసుఫియాన్‌ దర్గా ప్రాంతంలో షరీఫ్‌ ఆలం జనరల్‌ స్టోర్స్‌ నిర్వహిస్తున్న అహ్మద్‌ ఆలం ఖాన్‌ ఇతడి వద్ద ఆ సిగరెట్ల ఖరీదు చేస్తున్నాడు.

ఆపై వీటిని పొగరాయుళ్లకు విక్రయిస్తున్నాడు. దీనిపై సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ జావేద్‌ నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, టి.శ్రీధర్‌ తమ బృందాలతో దాడి చేశారు. మిలన్‌కుమార్, ఆలం ఖాన్‌లను అదుపులోకి తీసుకుని రూ.90 వేల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను హబీబ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్‌ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెప్తున్నారు. ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకపోవడంతో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఆరోగ్యానికి హానికరం..
చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్‌ హెల్త్‌ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి భారీగా హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండవని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని అధికారులు వివరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top