తుల్జారావుపేటలో శిశు విక్రయం
అధికారుల చొరవతో తల్లి ఒడికి
నల్లగొండ, చివ్వెంల (సూర్యాపేట) : మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామంలో శిశువును విక్రయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుగలోతు లింగయ్య, సరోజ దంపతులకు ఆగస్టు 25న పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ శిశువు జన్మించింది. నెలరోజుల పాటు తల్లి వద్దనే ఉన్న శిశువు ఇటీవలే సూర్యాపేటకు చెందిన ఓ డ్రైవర్ ద్వారా విజయవాడకు చెందిన వారికి రూ.10 వేలకు విక్రయించారు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక అంగన్వాడీ కార్యకర్త తేజావత్ జానమ్మ ఐసీడీఎస్ సీడీపీఓకు సమాచారం అందించారు.
దీంతో అక్కడకు చేరుకున్న సీడీపీఓ అరుణ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి శిశువును తల్లి ఒడికి చేర్చారు. చిన్నారిని ఇక నుంచి తానే చూసుకుంటానని, లేకపోతే ఐసీడీఎస్కు అప్పగిస్తానని తల్లి నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. శిశువును తెలిసిన వారికి దత్తత ఇచ్చామని.. ఆస్పత్రి ఖర్చుల కింద వారు రూ. 10 వేలు ఇచ్చారని తల్లిదండ్రులు తమతో చెప్పినట్లు సీడీపీఓ తెలిపారు.