ఆటో, టాటా ఏస్‌ వాహనాల ఢీ | Auto Accident in east Godavari | Sakshi
Sakshi News home page

ఆటో, టాటా ఏస్‌ వాహనాల ఢీ

Jun 6 2019 1:43 PM | Updated on Jun 6 2019 1:43 PM

Auto Accident in east Godavari - Sakshi

గుండాల వద్ద ఘటనా స్థలంలో క్షతగాత్రులు

నెల్లిపాక (రంపచోడవరం): టాటా ఏస్‌ వాహనం, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో తొమ్మిది మంది ఉండగా వారిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. వివరాల్లోకెళితే.. తెలంగాణలోని అశ్వారావుపేట మండలం మద్దులమడ గ్రామంలోని ఒకే కుటుంబానికి  చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు, ముగ్గురు చిన్నారులు చింతూరు మండలం మల్లంపేట గ్రామసమీప అటవీప్రాంతంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. వీరు బుధవారం తిరిగి వారి గ్రామానికి వెళ్లే క్రమంలో భద్రాచలం వెళ్లేందుకు ఏడుగురాళ్లపల్లి గ్రామం వద్ద ఓ ఆటో ఎక్కారు. భద్రాచలం మరో ఏడు కిలోమీటర్లు ఉందనగా గుండాల గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఆటో ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అటో బోల్తా పడిపోవడంతో అందులో ఉన్న వారందరూ ఆటో కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. మడకం శిరమయ్య, మరియమ్మ, ఉంగమ్మ, సోమయ్య, దేవయ్య, రామయ్య, దూలయ్య, బీమమ్మ, పేరాల సత్యనారాయణ, శ్రీను ఉన్నారు. వీరిలో ఉంగమ్మ, మరియమ్మ గర్భిణులు. ప్రమాద సమయంలో ఎటపాక ఎస్సైలు చినబాబు, సాగర్‌లు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను వారే టాటా మేజిక్‌ వాహనంలో ఎక్కించి భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి, చికిత్సలు చేయించారు. బాధితుల్లో రామయ్య, మరియమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి వాహనాల అతివేగమే కారణమని తెలిసింది. ఆటో డ్రైవర్‌ గాయలతో ఆస్పత్రికి వచ్చినా అక్కడి నుంచి పరారయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement