జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
సాక్షి, శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. బండిపోర జిల్లాలో పనార్ అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలపై అందిన సమాచారంతో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో తలదాచుకున్న మరికొందరు ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ ఆర్మీ జవాన్ చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. సీఆర్పీఎఫ్, రాష్ర్టీయ రైఫిల్స్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మరణించిన ఉగ్రవాదులు ఎవరనేది నిర్ధారించలేదు. కాగా బుధవారం సాంబ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరో ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే.