డూప్‌తో కానిచ్చేశారని, నటుడు ఫిర్యాదు

Actor Bobby Simha files police complaint against Agni Devi director - Sakshi

చెన్నై : అగ్నిదేవి చిత్రంలో తనకు బదులు డూప్‌ను నటింపజేశారని నటుడు బాబీసింహా ఆ చిత్ర దర్శక నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే తిగర్‌ తండా, నేరం, కరుప్పన్, పేట వంటి చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించిన నటుడు బాబీసింహా. ఆయన తాజాగా అగ్నిదేవి అనే చిత్రంలో నటించారు. దీన్ని జాన్‌పాల్‌ రాజ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర హీరో బాబీసింహా అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాతపై సెయింట్‌ థామస్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అగ్నిదేవి చిత్రంలో తాను ఐదు రోజులే నటించానని, ఆ తరువాత తనకు చెప్పిన కథ కాకుండా వేరే కథను రూపొందిస్తుండటం, తాను నటించిన సన్నివేశాలను చూపించమని అడగ్గా అందుకు నిరాకరించడం, చిత్రం పేరును అగ్నిదేవి అని మా ర్చడం వంటి సమస్యలతో తానా చిత్రం నుంచి వైదొలగినట్లు పేర్కొన్నారు.

చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారని,  పోస్టర్లలో తన ఫొటోలను వాడుతున్నారని తెలిపారు. తాను నటించని చిత్రంలో తనకు బదులు డూప్‌ను నటింపజేశారని పేర్కొన్నారు. అదే విధంగా దీనికి సంబంధించిన కేసు కోవై సివిల్‌ కోర్టులో విచారణలో ఉందని, అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాత జాన్‌పాల్‌రాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాబీసింహా ఫిర్యాదుతో అగ్నిదేవి చిత్ర దర్శక నిర్మాతపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కమిషనర్‌ నందంబాక్కం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top