జనవరిలో ప్యాసింజర్‌ స్పీడ్‌.. | Vehicle sales spped up | Sakshi
Sakshi News home page

జనవరిలో ప్యాసింజర్‌ స్పీడ్‌..

Feb 13 2018 1:56 AM | Updated on Feb 13 2018 1:56 AM

Vehicle sales spped up - Sakshi

గ్రేటర్‌ నోయిడా: దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాల్లో వార్షిక ప్రాతిపదికన జనవరి నెలలో 7.57 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 2,65,389 యూనిట్ల నుంచి 2,85,477 యూనిట్లకు పెరిగాయి. దీనికి యుటిలిటీ వాహనాల బలమైన డిమాండ్‌ ప్రధాన కారణం. అయితే కార్ల విక్రయాల్లో 1.25 శాతం క్షీణత కనిపించింది. ఇవి 1,86,596 యూనిట్ల నుంచి 1,84,264 యూనిట్లకు తగ్గాయి. యుటిలిటీ వాహన (యూవీ) అమ్మకాలు ఏకంగా 37.88 శాతం వృద్ధితో 62,263 యూనిట్ల నుంచి 85,850 యూనిట్లకు ఎగిశాయి. నెలవారీ విక్రయాల పరంగా చూస్తే ఇది రెండో గరిష్ట స్థాయి.

గతేడాది జూలైలో యుటిలిటీ వాహన విక్రయాలు అత్యధికంగా 86,874 యూనిట్లుగా నమోదయ్యాయి. సియామ్‌ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో వృద్ధి అంచనాలకు అనుగుణంగానే ఉందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథూర్‌ తెలిపారు. యుటిలిటీ విభాగపు జోరు కొనసాగుతోందన్నారు.

అయితే కారు సెగ్మెంట్‌లో విక్రయాలు స్థిరంగా ఉన్నాయని, దీనికి ఎంట్రీ లెవెల్‌ విభాగంలో కొత్త ఆవిష్కరణలు లేకపోవడం, కస్టమర్లు క్రాస్‌ఓవర్స్, కాంపాక్ట్‌ ఎస్‌యూవీల వైపు మళ్లడం వంటివి కారణంగా పేర్కొన్నారు. మోటార్‌సైకిల్స్, స్కూటర్లకు గ్రామీణ, పట్టణ మార్కెట్లలో బలమైన డిమాండ్‌ ఉందని తెలిపారు.  

మారుతీ విక్రయాలు 4 శాతం అప్‌
దేశీ దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 4.05 శాతం వృద్ధితో 1,39,189 యూనిట్లకు పెరిగాయి. ఇక హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాల్లో 8.31 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 45,508 యూనిట్లుగా ఉన్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ అమ్మకాలు వరుసగా 17.73% వృద్ధితో 23,656 యూనిట్లకు, 48.58% వృద్ధితో 21,872 యూనిట్లకు ఎగశాయి.  

టూవీలర్‌ జోరు: జనవరిలో మొత్తం టూవీలర్‌ విక్రయాలు 33.43 శాతం వృద్ధితో 12,62,140 యూనిట్ల నుంచి 16,84,066 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్‌ అమ్మకాల్లో 28.64 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 10,54,062 యూనిట్లుగా ఉన్నాయి.

మార్కెట్‌ లీడర్‌ హీరో మోటోకార్ప్‌ దేశీ మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 24.39 శాతం వృద్ధితో 4,36,771 యూనిట్ల నుంచి 5,43,325 యూనిట్లకు పెరిగాయి. ఇక హోండా స్కూటర్‌ అండ్‌ మోటార్‌సైకిల్‌ (హెచ్‌ఎంఎస్‌ఐ) విక్రయాల్లో 21.82 శాతం వృద్ధి, బజాజ్‌ ఆటో విక్రయాల్లో 36.14 శాతం వృద్ధి కనిపించింది. ఇక టీవీఎస్‌ మోటార్స్‌ అమ్మకాల్లో 25.91 శాతం వృద్ది, హీరో మోటొకార్ప్‌ విక్రయాల్లో 117.63 శాతం వృద్ధి కనిపించింది. ఇక వాణిజ్య వాహన అమ్మకాలు 39.73 శాతం వృద్ధితో 85,660 యూనిట్లకు పెరిగాయి.

వాహన పరిశ్రమ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) జర్నీకి వేగంగా సిద్ధమౌతోందని సియామ్‌ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సహా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సవాళ్ల పరిష్కారానికి ఒక దీర్ఘకాలిక పాలసీని ఆవిష్కరించాలని కోరింది. అలాగే ఈవీలపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని డిమాండ్‌ చేసింది.

దీనివల్ల అందుబాటు ధరలో ఈవీలు కస్టమర్లకు లభ్యమౌతాయని పేర్కొంది. ‘ఆటో ఎక్స్‌పోలో వివిధ కంపెనీలు పలు విభాగాల్లో కాన్సెప్ట్‌ వెహికల్స్‌ను మాత్రమే కాకుండా 28 వరకు మార్కెట్‌–రెడీ ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా ఆవిష్కరించాయి. ఇందులో టాటా మోటార్స్, మహీంద్రా, అశోక్‌ లేలాండ్, లోహియా, జేబీఎం వంటి పలు కంపెనీల వెహికల్స్‌ ఉన్నాయి. వాహన పరిశ్రమ ఈవీలపై ఏ స్థాయిలో దృష్టి కేంద్రీకరించిందో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు’ అని విష్ణు మాథూర్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement