అన్ని కార్లూ... రయ్ రయ్
నవంబర్ విక్రయాల్లో రెండంకెల వృద్ధి
మారుతీ 15%; హోండా 47 శాతం
అదే బాటలో హ్యుందాయ్, టయోటా, మహీంద్రా, అశోక్లేలాండ్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ తర్వాత కూడా వాహన అమ్మకాల్లో స్పీడ్ తగ్గలేదు. కార్ల కంపెనీల నవంబర్ నెల విక్రయాల్లో ఏకంగా రెండంకెల వృద్ధి నమోదయింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, మహీంద్రా, హోండా వంటి పలు కంపెనీలు చక్కని గణాంకాలు ప్రకటించాయి. రానున్న నెలల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని కంపెనీలు ధీమా వ్యక్తం చేశాయి. వాహన కంపెనీల దేశీ విక్రయాలను ఒకసారి పరిశీలిస్తే..
♦ దేశీ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశీ విక్రయాలు 15% ఎగిశాయి. ఇవి 1,26,325 యూనిట్ల నుంచి 1,45,300 యూనిట్లకు పెరిగాయి.
♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన అమ్మకాలు 10 శాతం వృద్ధితో 44,008 యూనిట్లకు పెరిగాయి. నెక్స్ట్జెనరేషన్ వెర్నా, గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20, క్రెటా వంటి మోడళ్లకు అధిక డిమాండ్తో ఈ వృద్ధి సాధ్యమైందని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు.
♦ హోండా కార్స్ ఇండియా విక్రయాలు 47 శాతం వృద్ధితో 11,819 యూనిట్లకు పెరిగాయి. ‘గతేడాది నవంబర్లో కంపెనీ విక్రయాలపై డీమోనిటైజేషన్ ప్రభావం అధికంగా పడింది. తాజాగా వాహన అమ్మకాలు మెరుగుపడ్డాయి. జీఎస్టీ ప్రభావం నుంచి మార్కెట్ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉంది’ అని సంస్థ ప్రెసిడెంట్, సీఈవో యుచిరో యుయెనో తెలిపారు.
♦ టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 13% వృద్ధితో 12,734 యూనిట్లకు పెరిగాయి.
♦ ‘నవంబర్ నెలలో రెండంకెల వృద్ధిని నమోదుచేశాం. పూర్తిస్థాయి సామర్థ్య వినియోగంతో ఇన్నోవా, ఫార్చునర్ కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా చెప్పారు.
♦ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన అమ్మకాలు 29,869 యూనిట్ల నుంచి 36,039 యూనిట్లకు ఎగశాయి. అంటే 21 శాతం వృద్ధి నమోదయ్యింది.
♦ అశోక్ లేలాండ్ మొత్తం విక్రయాలు 51% వృద్ధితో 9,574 యూనిట్ల నుంచి 14,460 యూనిట్లకు పెరిగాయి.
ఆడి ఆఫర్.. రూ.8.85 లక్షల డిస్కౌంట్
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా పరిమిత కాల ధరల తగ్గింపు ఆఫర్ను ప్రకటించింది. సంవత్సర ముగింపు విక్రయాల కింద ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8.85 లక్షల వరకూ డిస్కౌంట్ను అందిస్తోంది. ఆడి ఏ3, ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ3 మోడళ్లపై ప్రత్యేకమైన ధరతో పాటు సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ను అందుబాటులో ఉంచింది. ఆఫర్లో భాగంగా ఆడి ఏ3ని రూ.26.99 లక్షలకు పొందొచ్చు. దీని అసలు ధర రూ.31.99 లక్షలు. క్రిస్మస్, న్యూ ఇయర్లను నేపథ్యంలో కంపెనీ ఈ ఆఫర్ తెచ్చింది.
పెరిగిన ‘ఇసుజు’ వాహన ధరలు
ఇసుజు మోటార్స్ ఇండియా వాహన ధరలను రూ.లక్ష వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. వివిధ మోడళ్లపై ధరల పెంపు 3–4% శ్రేణిలో ఉంటుందని ఇసుజు మోటార్ ఇండియా తెలిపింది. కాగా గత నెలలో స్కోడా ఆటో ఇండియా కూడా వాహన ధరలను జనవరి 1 నుంచి 2–3% శ్రేణిలో పెంచుతున్నట్లు ప్రకటించింది.